TTD Srivani Tickets: టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు దర్శన టిక్కెట్లు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆఫ్లైన్ విధానంలో జారీ చేసే శ్రీవాణి దర్శన టిక్కెట్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే డిసెంబరు 30 నుంచి జనవరి 1వరకు శ్రీవాణి దర్శన టిక్కెట్ల జారీ విధానాన్ని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను పూర్తిగా ఆన్లైన్ విధానంలో విక్రయించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
Details
ఆఫ్లైన్ కౌంటర్లను కూడా రద్దు చేసే అవకాశం
జనవరి 9 నుంచి తిరిగి శ్రీవాణి దర్శన టిక్కెట్ల పునరుద్ధరణపై ఆలోచన చేస్తున్నట్లు పేర్కొంది. ఇకపై ఆఫ్లైన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి, సంపూర్ణంగా ఆన్లైన్ విధానంలోనే దర్శన టిక్కెట్లను జారీ చేయాలని టీటీడీ ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఒక రోజు ముందుగానే ఆన్లైన్లో 1,000 శ్రీవాణి దర్శన టిక్కెట్లను విడుదల చేసే యోచనలో ఉంది. అదే సమయంలో తిరుమలతో పాటు రేణిగుంట విమానాశ్రయంలో ఉన్న ఆఫ్లైన్ కౌంటర్లను కూడా రద్దు చేసే అవకాశం ఉందని సమాచారం. భక్తుల రద్దీ నియంత్రణ, దర్శన సౌకర్యాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టీటీడీ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.