TTD Server Issue: టీటీడీ సర్వర్ డౌన్.. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ జారీ నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ జారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు ఆన్లైన్లో విడుదల అవుతాయి. అయితే ఈరోజు సర్వర్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ఆ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆఫ్లైన్ విధానంలో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నమయ్య భవన్లో టికెట్లు అందుబాటులో ఉంచారు.
వివరాలు
అవసరమైన గుర్తింపు పత్రాలతో సమయానికి హాజరుకావాలి
టికెట్లు పొందదలచిన భక్తులు అవసరమైన గుర్తింపు పత్రాలతో సమయానికి హాజరుకావాలని అధికారులు సూచించారు. ఇక సర్వర్ సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. సమస్య పూర్తిగా పరిష్కారమైన వెంటనే ఆన్లైన్ సేవలను మళ్లీ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని టీటీడీ అధికారులు సూచించారు.