
Tungabhadra తుంగభద్ర జలాశయానికి వరద.. 77 వేల క్యూసెక్కులకు పెరిగిన ప్రవాహం
ఈ వార్తాకథనం ఏంటి
తుంగభద్ర జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతానికి 77 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చేస్తోంది. డ్యామ్ భద్రతను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమై, 26 గేట్లను పైకి ఎత్తి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాటిలో 10 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తగా, మిగతా 16 గేట్లను మూడున్నర అడుగుల మేర ఎత్తి నీటిని వదిలారు. విద్యుదుత్పత్తితో కలిపి ప్రస్తుతం డ్యామ్ నుంచి 93 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు పంపుతున్నట్లు ఇంజినీర్లు వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 75.36 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
వివరాలు
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్కు నీటి విడుదల
శ్రీశైలం జలాశయంలోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం వద్ద ఒక రేడియల్ క్రస్ట్ గేటును 10 అడుగుల మేర పైకి ఎత్తి,స్పిల్వే ద్వారా 26,698 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. అదే సమయంలో కుడి,ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 66,417 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే, జూరాల,సుంకేశుల జలాశయాల నుంచి కలిపి మొత్తం 1,18,274 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీశైలం జలాశయం వద్ద నీటి మట్టం 882 అడుగులు, నిల్వ మొత్తం 198.812 టీఎంసీలుగా నమోదైంది.