Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్.. ముంబైకి గవర్నర్..
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు రోజురోజుకు మరింత వేగం పుంజుకుంటున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఉదయం 10.30 గంటలకు గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. అయితే కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా గవర్నర్ తన స్వస్థలమైన ముంబయికి వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి బెంగళూరుకు వచ్చే తేదీ కూడా ఇంకా ఖరారు కాలేదని, విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్ కూడా బుక్ చేయలేదని తెలుస్తోంది.
వివరాలు
రాజ్యసభకు సిద్ధూ నో..!
దీంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. గవర్నర్ ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోయినా రాజీనామా ప్రక్రియ మాత్రం ఆగదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. సిద్ధరామయ్య తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కార్యాలయానికి సమర్పించే అవకాశముందని వెల్లడించాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసినట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఆయన జాతీయ రాజకీయాల వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టాలని సిద్ధరామయ్య నిర్ణయించుకున్నట్లు సమాచారం.