Kerala: కేరళలో యూడీఎఫ్ దూకుడు.. సీఎం పినరయి విజయన్ వెనుకంజ
ఈ వార్తాకథనం ఏంటి
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం యూడీఎఫ్ దాదాపు 95 స్థానాల్లో ముందంజలో నిలిచింది. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మాదం నియోజకవర్గంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఆధిక్యంలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులోనే యూడీఎఫ్కు స్పష్టమైన మెజారిటీ కనిపించింది. ఎగ్జిట్ అంచనాలకు అనుగుణంగా ఫలితాల ధోరణి కొనసాగుతోంది. ప్రతి రౌండ్ పూర్తయ్యే కొద్దీ యూడీఎఫ్ ఆధిక్యం మరింత బలపడుతోంది.
వివరాలు
వెనుకంజలో పినరయి విజయన్ శిబిరానికి చెందిన అభ్యర్థులు
ఇక బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. మంజేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నేత కే సురేంద్రన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఎల్డీఎఫ్ శ్రేణులకు భారీ షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని శిబిరానికి చెందిన అభ్యర్థులు అనేక నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వీఎన్ వాసన్, ఆర్ బిందు, వీణా జార్జ్, జే చించు రాణి, రామచంద్రన్ కదన్నపల్లి, ఎంబీ రాజేశ్ తదితరులు ప్రస్తుతం వెనుకబడినట్లు సమాచారం.