LOADING...
Udhayanidhi Stalin: అసెంబ్లీలో మళ్లీ సనాతన ధర్మ వివాదం.. ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Udhayanidhi Stalin: అసెంబ్లీలో మళ్లీ సనాతన ధర్మ వివాదం.. ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2026 ఎన్నికల తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఆయన సనాతన ధర్మంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ప్రజలను విభజించే సనాతన భావజాలాన్ని పూర్తిగా అంతం చేయాలి" అంటూ ఉదయనిధి వ్యాఖ్యానించారు. దీంతో సభలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ మొదలైంది.

వివరాలు 

అసెంబ్లీలో మాట్లాడటంతో చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపు

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. ఆ సమయంలో ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈసారి పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ్యులు చేసే వ్యాఖ్యలకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 194 కింద ప్రత్యేక రక్షణ ఉంటుంది. అందువల్ల సభలో చేసిన వ్యాఖ్యలపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

ఉదయనిధి వ్యాఖ్యల వల్లే డీఎంకే ఓడిపోయిందంటూ బీజేపీ నేతల విమర్శలు

ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ జాతీయ సమాచార విభాగం బాధ్యుడు అమిత్ మాలవ్య సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లో స్పందిస్తూ.. ఎన్నికల్లో ఎదురైన ఎదురుదెబ్బల తర్వాత ఇప్పుడు అసెంబ్లీ రక్షణలో నిలబడి ఉదయనిధి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మరో బీజేపీ నేత నారాయణ్ తిరుపతి కూడా స్పందిస్తూ.. సనాతన ధర్మంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వల్లే ప్రజలు డీఎంకేకు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచాయి.

Advertisement