LOADING...
Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్
ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్

Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో ఇప్పటివరకు ఒక్క అధికారిక కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేసింది. అయితే అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా విమానాశ్రయాలు,సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను పెంచి పర్యవేక్షణ కొనసాగిస్తోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇటీవల ఉగాండా నుంచి కర్ణాటకకు చేరుకున్న ఓ వ్యక్తికి శరీర నొప్పులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా అతడిని బెంగళూరులో ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచారు. అనంతరం అతని నమూనాలను పూణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించి పరీక్షలు నిర్వహించారు.

వివరాలు 

విమానాశ్రయాల వద్ద ముమ్మరంగా స్క్రీనింగ్

ఆ నివేదికల్లో ఎబోలా లక్షణాలు లేవని తేలడంతో అధికారులు ఊరట పొందారు. ఆఫ్రికా ప్రాంతం నుంచి వచ్చిన కారణంగానే ఈ పరీక్షలు చేపట్టినట్లు వైద్యులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆరోగ్య పరిస్థితులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిరంతరం గమనిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రజారోగ్య నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా అంతర్జాతీయ విమానాశ్రయాలు, ప్రవేశ కేంద్రాల వద్ద ప్రత్యేక స్క్రీనింగ్ కొనసాగుతోంది. వైరస్‌ను ముందుగానే గుర్తించేందుకు దేశవ్యాప్తంగా అత్యవసర స్పందన వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

900కు పైగా అనుమానిత కేసులు

ఇదిలా ఉండగా ఆఫ్రికా ఖండంలో బుండిబుగ్యో ఎబోలా రకం వేగంగా విస్తరిస్తోంది. కాంగోలో ఇప్పటివరకు 101 అధికారిక కేసులు, 10 మరణాలు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన అధికారి టెడ్రోస్ అధానోమ్ వెల్లడించారు. అదనంగా మరో 900కు పైగా అనుమానిత కేసులు, 220 మరణాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. వైరస్ ప్రభావం అంచనాలకు మించి పెరుగుతోందని హెచ్చరించారు. పొరుగు దేశమైన ఉగాండాలో కూడా ఇద్దరు వైద్య సిబ్బందితో కలిపి మొత్తం ఏడు కేసులు నమోదైనట్లు సమాచారం.

Advertisement