LOADING...
UK Doctor: ఫేస్‌బుక్ పోస్టుతో 4 నెలలు భారత్‌లోనే చిక్కుకున్న యూకే వైద్యుడు.. ఎట్టకేలకు స్వదేశానికి..
. ఎట్టకేలకు స్వదేశానికి..

UK Doctor: ఫేస్‌బుక్ పోస్టుతో 4 నెలలు భారత్‌లోనే చిక్కుకున్న యూకే వైద్యుడు.. ఎట్టకేలకు స్వదేశానికి..

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ వ్యతిరేక ఫేస్‌బుక్ పోస్టు కారణంగా ముంబై పోలీసులు నమోదు చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌ (LOC)తో నాలుగు నెలల పాటు భారత్‌లోనే చిక్కుకుపోయిన బ్రిటన్‌కు చెందిన భారత సంతతి వైద్యుడు డాక్టర్ సంగ్రామ్ పాటిల్ ఎట్టకేలకు యూకేకు వెళ్లేందుకు అనుమతి పొందారు. ముంబై హైకోర్టు జోక్యంతో ఆయనకు ఊరట లభించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతానని హామీ ఇవ్వడంతో మే 11లోపు LOC సవరించాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. సంగ్రామ్ పాటిల్(49)యూకేలో నేషనల్ హెల్త్ సర్వీస్‌ (NHS)లో అనస్థీషియా కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. జనవరి 10న భార్యతో కలిసి భారత్‌కు వచ్చిన ఆయనను ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.

వివరాలు 

12 పదాల పోస్టుకే FIR, LOC

తనపై కేసు ఉందని చెప్పి క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తీసుకెళ్లి గంటల పాటు విచారించారు. జనవరి 19న తిరిగి యూకే వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ LOC కారణంగా అనుమతించలేదు. ఈ వ్యవహారంపై స్పందించిన పాటిల్.. "సోషల్ మీడియాలో పెట్టిన 12 పదాల పోస్టుకే FIR, LOC రావడం షాక్‌కు గురిచేసింది. నా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడింది. ఉద్యోగం కూడా పోయే పరిస్థితి వచ్చింది" అని తెలిపారు. నాలుగు నెలల జీతం నష్టం, న్యాయపరమైన ఖర్చులతో దాదాపు రూ.50 లక్షల వరకు ఆర్థిక భారం పడిందన్నారు. గతేడాది డిసెంబర్ 18న మహారాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.

వివరాలు 

BNS సెక్షన్ 353(2) వర్తించదు: పాటిల్  

తన పోస్టులో ఎలాంటి ద్వేష ప్రసంగం లేదని, ఏ సమాజాన్నీ లక్ష్యంగా చేసుకోలేదని పాటిల్ స్పష్టం చేశారు. తనపై పెట్టిన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 353(2) వర్తించదని పేర్కొన్నారు. జల్గావ్‌కు చెందిన పాటిల్ 2004లో ఉద్యోగం కోసం యూకే వెళ్లారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, మహిళా భ్రూణహత్యల వ్యతిరేక ఆందోళనలు, అన్నా హజారే ఉద్యమంలో కూడా పాల్గొన్నానని చెప్పారు.

Advertisement

వివరాలు 

ఒక పోస్టు కారణంగా ఇంత పెద్ద సమస్య ఎదురవుతుందని ఊహించలేదు: పాటిల్  

సోషల్ మీడియాలో రాజకీయ అభిప్రాయాలు బహిరంగంగా వ్యక్తం చేస్తుండటంతో తనను టార్గెట్ చేసే అవకాశం ఉందని తనకు సన్నిహితులు ముందే హెచ్చరించారని సంగ్రామ్ పాటిల్ తెలిపారు. అయితే ఒక ఫేస్‌బుక్ పోస్టు కారణంగా ఇంత పెద్ద సమస్య ఎదురవుతుందని ఊహించలేదన్నారు. చివరకు మంగళవారం ఉదయం యూకేకు బయలుదేరిన పాటిల్‌ను విమానాశ్రయంలో కొద్దిసేపు ఆపి వివరాలు పరిశీలించిన తర్వాత వెళ్లేందుకు అనుమతించారు. అదే రోజు రాత్రికి ఆయన యూకేలోని తన ఇంటికి చేరుకున్నారు.

Advertisement