Amaravati: అమరావతిలో భూగర్భ విద్యుత్ నెట్వర్క్.. రూ.1,979 కోట్లతో భారీ పనులు
ఈ వార్తాకథనం ఏంటి
రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్లో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను మళ్లించడం (రీ-రూటింగ్) కోసం విద్యుత్ శాఖ భారీ స్థాయిలో పనులు చేపట్టింది. భవిష్యత్తులో రాజధానిలో ఎక్కడా విద్యుత్ తీగలు బయటకు కనిపించకుండా అత్యాధునిక భూగర్భ విద్యుత్ నెట్వర్క్ను ఏర్పాటు చేసేలా దశలవారీ ప్రణాళికను సిద్ధం చేసింది.
వివరాలు
రూ.1,979 కోట్లతో 18 పనులు
ప్రస్తుతం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న 400 కేవీ విద్యుత్ లైన్లను మళ్లించడం, అలాగే కొత్తగా రెండు సబ్స్టేషన్ల నిర్మాణం కోసం రూ.1,979.10 కోట్ల అంచనా వ్యయంతో 18 పనులు చేపట్టారు.
ఈ ప్రాంతం నుంచి వివిధ ప్రాంతాలకు 400 కేవీ, 220 కేవీ విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి.
ప్రధాన నిర్మాణాలకు అవి అడ్డుగా ఉండటంతో వాటి రీ-రూటింగ్ బాధ్యతను ఏపీ ట్రాన్స్కో చేపట్టింది.
ప్రతిపాదించిన పనుల్లో ఇప్పటికే సుమారు 27 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులను దశలవారీగా పూర్తి చేయనున్నారు.
వివరాలు
భూగర్భం ద్వారానే విద్యుత్ సరఫరా
రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో విద్యుత్ సరఫరా పూర్తిగా భూగర్భ కేబుళ్ల ద్వారానే జరిగేలా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు.
ఇందుకోసం భారీ డక్ట్ల నిర్మాణం కొనసాగుతోంది.
రాజధానిలో నిర్మాణంలో ఉన్న క్వాంటమ్ వ్యాలీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు, ఇతర కీలక భవనాలకు అవసరమైన విద్యుత్ను భూగర్భ లైన్ల ద్వారానే అందించేలా డిజైన్లు రూపొందించి, వాటి ప్రకారం నిర్మాణ పనులు చేపడుతున్నారు.
వివరాలు
55 కిలోమీటర్ల భూగర్భ విద్యుత్ లైన్లు
తాళ్లాయిపాలెం సబ్స్టేషన్ నుంచి భారీ డక్ట్ నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 220 కేవీ విద్యుత్ సరఫరా కోసం సుమారు 24 లైన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
మొత్తం 55 కిలోమీటర్ల మేర భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ స్తంభాలు, లైన్లు, తీగలను దశలవారీగా తొలగించనున్నారు.
రాజధాని మొత్తం 33 కేవీ/415 వోల్టుల విద్యుత్ నెట్వర్క్ ఏర్పాటు చేయనుండటంతో భవిష్యత్తులో రోడ్లపై విద్యుత్ తీగలు కనిపించే పరిస్థితి ఉండదు.
వివరాలు
కొత్తగా జీఐఎస్ సబ్స్టేషన్లు
తుళ్లూరు, తాడేపల్లి, లింగాయపాలెం, నేలపాడు ప్రాంతాల్లో 220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్లు (GIS) ఏర్పాటు చేసి విద్యుత్ నెట్వర్క్ను అనుసంధానించనున్నారు.
ఇప్పటికే నేలపాడు, లింగాయపాలెం ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణం ప్రారంభమైంది.
తాడేపల్లి 132 కేవీ సబ్స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుతుండగా, తదుపరి దశలో తుళ్లూరు సబ్స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజధానికి సుమారు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగిన ఆధునిక విద్యుత్ నెట్వర్క్ అందుబాటులోకి రానుంది.
వివరాలు
400 కేవీ లైన్ల రీ-రూటింగ్ ప్రారంభం
400 కేవీ వీటీపీఎస్-సత్తెనపల్లి, పీజీసీఐఎల్-నున్న-నెల్లూరు మధ్య ఉన్న విద్యుత్ లైన్ల రీ-రూటింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
రాజధానిలో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న ట్రాన్స్కో, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు చెందిన విద్యుత్ లైన్లను ఒకే టవర్ ద్వారా తీసుకెళ్లేలా కొత్త డిజైన్ రూపొందించారు.
ఈ మేరకు టవర్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తికావచ్చినట్లు అధికారులు తెలిపారు.