Unnao rape case: ఉన్నావ్ అత్యాచార కేసు.. నిందితుడి విడుదలకు సుప్రీం బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈకేసులో నిందితుడు, బహిష్కృత బీజేపీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన శిక్షను నిలిపివేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. సెంగర్ జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ దిల్లీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సీబీఐ అధికారులు, బాధితురాలి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అప్పీల్పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేస్తూ, కుల్దీప్ సింగ్ సెంగర్ను కస్టడీ నుంచి విడుదల చేయొద్దని పోలీసుశాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే సీబీఐ దాఖలు చేసిన పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సెంగర్కు నోటీసులు జారీ చేసింది.
Details
దిల్లీ హైకోర్టు తీర్పుపై తీవ్ర నిరసనలు
2017లో ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను కుల్దీప్ సింగ్ సెంగర్ కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసుతో పాటు సంబంధిత ఇతర కేసులను ఆగస్టు 1, 2019న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ప్రదేశ్ ట్రయల్ కోర్టు నుంచి దిల్లీకి బదిలీ చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టిన దిల్లీ హైకోర్టు ఇటీవల సెంగర్కు విధించిన శిక్షను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బాధితురాలు, మహిళా సంఘాల నేతలు తీవ్ర నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాధితురాలి తరఫు న్యాయవాదులు, సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తాజాగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.