US-Bangladesh deal: వస్త్ర రంగానికి భారీ దెబ్బ.. US-బంగ్లా డీల్పై కాంగ్రెస్ ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-బంగ్లాదేశ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం భారత్కు చెడు వార్త అని కాంగ్రెస్ విమర్శించింది. ఈ ఒప్పందం వల్ల భారత వస్త్ర రంగానికి తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని పార్టీ పేర్కొంది. ఎక్స్లో చేసిన పోస్టులో, భారత దుస్తులపై అమెరికా విధిస్తున్న సుంకం 18 శాతం కాగా,బంగ్లాదేశ్ దుస్తులపై 19 శాతం ఉన్నప్పటికీ,భారత్కు లేని జీరో డ్యూటీ (0%) ప్రవేశ క్లాజ్ బంగ్లాదేశ్కు ఉందని కాంగ్రెస్ గుర్తు చేసింది. అంటే, అమెరికా పత్తి లేదా మానవ నిర్మిత ఫైబర్లతో బంగ్లాదేశ్లో తయారైన దుస్తులు అమెరికా మార్కెట్లో ఎలాంటి సుంకం లేకుండా ప్రవేశిస్తాయని,దీనివల్ల బంగ్లాదేశ్కు స్పష్టమైన లాభం కలుగుతుందని తెలిపింది.
వివరాలు
భారత పత్తి రైతులు,నూలు తయారీదారులకు నష్టం
ప్రస్తుతం బంగ్లాదేశ్ భారత పత్తికి పెద్ద కొనుగోలుదారుగా ఉన్నప్పటికీ, ఈ ఒప్పందం కారణంగా జీరో డ్యూటీ ప్రయోజనం పొందేందుకు అక్కడి తయారీదారులు అమెరికా పత్తివైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, దాంతో భారత పత్తి రైతులు,నూలు తయారీదారులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని కాంగ్రెస్ హెచ్చరించింది. ఇప్పటికే వస్త్ర ఎగుమతుల్లో భారత్-బంగ్లాదేశ్ మధ్య పోటీ కొనసాగుతున్న పరిస్థితుల్లో, ఈ క్లాజ్ వల్ల భారత పత్తి రైతులకు,నూలు రంగానికి ఒక దెబ్బగా మారుతుండగా, మరోవైపు భారత దుస్తుల ఎగుమతిదారుల పరిస్థితిని మరింత కష్టతరం చేస్తోంది.
వివరాలు
లక్షలాది మంది జీవనాధారాలపై ప్రభావం
తిరుపూర్, సూరత్, పనిపట్ వంటి ప్రధాన వస్త్ర కేంద్రాలు అమెరికా మార్కెట్లో 18 శాతం సుంక లోటుతో పాటు, బంగ్లాదేశ్ను కీలక కొనుగోలుదారుగా కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటాయని కాంగ్రెస్ చెప్పింది. మొత్తంగా ఈ ఒప్పందం భారత వస్త్ర పరిశ్రమను బలహీనపరచి, లక్షలాది మంది జీవనాధారాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ స్పష్టం చేసింది.