Anmol Bishnoi: అన్మోల్ బిష్ణోయ్ను భారత్కు అప్పగించిన అమెరికా.. నేడు ఢిల్లీకి చేరుకోనున్న ప్రత్యేక విమానం
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు,అనేక పెద్ద నేరాల్లో ప్రధాన నిందితుడైన అన్మోల్ బిష్ణోయ్ను అమెరికా అధికారులు భారత ప్రభుత్వం చేతికి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అన్మోల్తో పాటు పంజాబ్కు చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్న నేరస్తులు, ఇంకా 197 మంది అక్రమ వలసదారులతో కూడిన ప్రత్యేక విమానం అమెరికా నుంచి బయల్దేరింది. ఈ విమానం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుతుందని అధికారులు ధృవీకరించారు. మాజీ మహారాష్ట్ర మంత్రి బాబా సిద్దిఖీ హత్య ప్రయత్నం,నటుడు సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పుల కేసుల్లో అన్మోల్పై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.
వివరాలు
లూసియానా నుంచి అతడిని భారత్కు తరలింపు
2022 ఏప్రిల్లో నకిలీ పాస్పోర్ట్తో దేశం విడిచిపోయినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. విదేశాల్లో దాక్కొని, ఎన్క్రిప్టెడ్ యాప్లను ఉపయోగిస్తూ తన నేర కార్యకలాపాలను నియంత్రించాడని దర్యాప్తులో తేలింది. గత ఏడాది కాలిఫోర్నియాలో అన్మోల్ అరెస్టయ్యాడు. స్థానిక పోలీసులు అతడిని కస్టడీలో ఉంచి, అతని కదలికలను పర్యవేక్షించేందుకు కాలికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ ట్రాకర్ (యాంకిల్ మానిటర్) అమర్చారు. ప్రస్తుతం లూసియానా నుంచి అతడిని భారత్కు తరలిస్తున్నారు. అమెరికా భూభాగం నుంచి అన్మోల్ను పంపించివేసినట్లు తమకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందిందని, బాబా సిద్దిఖీ కుమారుడు, ఎన్సీపీ నేత జీషన్ సిద్దిఖీ వెల్లడించారు. నిందితుడిని పట్టుకోవాలని అమెరికా అధికారులను పలుమార్లు కోరిన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఎన్ఐఏ కస్టడీకి తీసుకునే అవకాశం
అన్మోల్ను తీసుకువచ్చే విమానం బుధవారం ఉదయం ఢిల్లీలో దిగిన అనంతరం, అతడిని ఏ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకోవాలనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది. గ్యాంగ్స్టర్ నెట్వర్క్లపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ అతడిని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.