Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ .. అరెస్టు భయంతో ఫోన్ స్విచ్చాఫ్.. మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు!
ఈ వార్తాకథనం ఏంటి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ కనిపించకుండా అండర్గ్రౌండ్లోకి వెళ్లారని తెలుస్తోంది. విజయవాడలోని మాచవరం పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందన్న అనుమానంతోనే ఆయన పరారైనట్లు సమాచారం. ఈ నెల 17న విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో వంశీని ప్రధాన నిందితుడుగా(ఏ1) చేర్చారు. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయాలని వంశీ తన అనుచరులను ప్రేరేపించిన సంగతి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దానికి అనుగుణంగా,అతని అనుచరులు కర్రలు,ఇతర మారణాయుధాలతో సునీల్ను తీవ్రంగా గాయపరిచారని నేరాభియోగంలో పేర్కొన్నారు.
వివరాలు
ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణకు కూడా వంశీతో పాటు ఆయన అనుచరులు డుమ్మా
ఈ కేసులో వంశీతో పాటు యతీంద్ర రామకృష్ణ, కొమ్మా కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్ర శేషు, ఎం. బాబు, మల్పూరి ప్రభుకాంత్, అనగాని రవి తదితరులు నిందితులుగా ఉన్నారు. కొంతకాలంగా, వంశీ నివాసానికి వెళ్లిన పోలీసులు సమన్లు అందజేయడానికి ప్రయత్నించగా, అతను అక్కడ కనిపించలేదు. అంతేకాక, ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో వంశీ తన ఫోన్ ఆఫ్ చేసి, అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగింది. తాజాగా సోమవారం, విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో జరగాల్సిన సత్యవర్ధన్ కేసు విచారణకు వంశీ, ఆయన అనుచరుడు ఓలుపల్లి రంగా గైర్హాజరైలేదని సమాచారం. ప్రస్తుతం వంశీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.