Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్గ్రేషియాకు ప్రభుత్వం ఓకే
ఈ వార్తాకథనం ఏంటి
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగాలు చేసిన ప్రతి అర్హుడికి న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గెజిట్ నోటిఫికేషన్లో పేర్లు లేకపోయినా, సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాకపోయినా, అవార్డు పాస్ కాని అర్హులైన యువతకు కూడా పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా భావిస్తున్న ప్రభుత్వం.. వాటి నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు ఇతర ప్రాజెక్టుల్లో లేని విధంగా భరోసా కల్పించాలని సీఎం సూచించారు.
వివరాలు
రూ.169 కోట్ల ఎక్స్గ్రేషియా.. 1,800 పిటిషన్ల పరిశీలన
2019 కటాఫ్ తేదీ దాటినప్పటికీ అర్హత ఉన్న నిర్వాసితుల కోసం రూ.169 కోట్ల ఎక్స్గ్రేషియాను కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
2019 కటాఫ్ తేదీ నుంచి 2026 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నారు.
అర్హుల జాబితాలో తమ పేర్లను చేర్చాలని కోరుతూ ప్రభుత్వానికి దాదాపు 1,800 గ్రీవెన్సులు, పిటిషన్లు అందాయి.
వీటిపై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి, అర్హతలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పరిశీలన పూర్తయిన అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇవాళ్టి నుంచే ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
వివరాలు
ఆగస్టు 31న వెలిగొండకు నీరు
వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వివరాలు వెల్లడించారు.
రాబోయే ఆగస్టు 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
చివరి నిర్వాసితుడికి కూడా న్యాయం జరిగే వరకు పరిహారం, ఇతర సహాయ చర్యల ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
నిర్వాసిత కాలనీల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులను వేగంగా పూర్తి చేసి, అక్కడి ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పిస్తామని మంత్రి చెప్పారు.
వివరాలు
గత పాలకులపై మంత్రి విమర్శలు
గత పాలకులు ప్రాజెక్టు పూర్తికాకముందే హడావుడి, ప్రచారానికి పరిమితమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.
ప్రస్తుతం సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం సమర్థవంతంగా నీటి నిర్వహణ చేపడుతోందన్నారు.
డెల్టా ప్రాంతంలోని పంటలకు నిరంతరాయంగా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.