Page Loader
Cyber Scams: సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌.. లావోస్‌లో హైదరాబాద్‌ యువకులకు చిత్రహింసలు
సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌

Cyber Scams: సైబర్‌ నేరం చేయకుంటే కరెంట్‌ షాక్‌.. లావోస్‌లో హైదరాబాద్‌ యువకులకు చిత్రహింసలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 11, 2024
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల లావోస్‌లో సైబర్ బానిసలుగా ఉన్న భారతీయ యువకులను అక్కడి అధికారులు రక్షించిన విషయం తెలిసిందే. ఈ సైబర్ నేర ముఠాలు గతంలో కాంబోడియా,మయన్మార్‌లకే పరిమితమై ఉండగా,ఇప్పుడు లావోస్ వరకు విస్తరించాయి. బాధితుల్లో ఒకరు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం,హైదరాబాద్‌కు చెందిన రాపిడో బైక్‌రైడర్‌(23)కి ఫాజిల్‌ఖాన్‌ అనే వ్యక్తి లావోస్‌లో ఛాట్‌ప్రాసెస్‌ ఉద్యోగం పేరుతో 35 వేల జీతం ఆశ చూపించాడు. అతను అబ్దుల్‌సమీ, దావూద్‌ అనే ఏజెంట్లను పరిచయం చేయడంతో, బైక్‌రైడర్‌ తన స్నేహితుడితో కలిసి లావోస్‌కు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. వీరు 30 వేలు చెల్లించి, మే 1న సింగపూర్‌ మీదుగా లావోస్‌ రాజధాని వియెంటియాన్‌కు చేరుకున్నారు.

వివరాలు 

ప్రవాస భారతీయులను మోసగించేందుకు హనీట్రాప్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు

గోల్డెన్‌ ట్రయాంగిల్‌కు వచ్చిన వీరి పాస్‌పోర్టులను ఇథియోపియన్‌ ఏజెంట్‌ తీసుకుని, టాన్‌పెర్న్‌ డిస్ట్రిక్ట్‌లోని ఒక కంపెనీకి పంపించాడు. అక్కడ వారికి కొన్ని పరీక్షలు నిర్వహించి, ఒప్పందంపై సంతకాలు తీసుకున్నారు. మొదటి రోజే కొత్త ఐఫోన్‌లు ఇచ్చి, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ సృష్టించారు. బాధితులు కొద్ది రోజుల్లోనే తమతో సైబర్‌ నేరాలు చేయించబోతున్నారని గ్రహించారు. తమను తిరిగి ఇండియాకు పంపించాలని ఏజెంట్లు సమీ, దావూద్‌లు వారు వేడుకున్నారు. చూస్తామని చెప్పిన ఆ ఇద్దరూ తర్వాత కనిపించలేదు. బాధితులు ప్రవాస భారతీయులను మోసగించేందుకు హనీట్రాప్, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పేరుతో తప్పుడు పనులు అప్పగించారు. ఫేస్‌బుక్‌లో ఎన్‌ఆర్‌ఐలకు అమ్మాయిల పేరిట ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపి, వారి వద్ద నుంచి పెట్టుబడులు రాబట్టాలని చెబుతూ, టార్గెట్‌ను పూర్తిచేయకపోతే చిత్రహింసలకు గురిచేస్తుండేవారు.

వివరాలు 

 ధైర్యం చేసిన హైదరాబాద్‌ యువకులు 

వాళ్లు ఇచ్చిన టార్గెట్ పూర్తిచేయకుంటే కరెంట్‌ షాక్‌లు ఇవ్వడం.. 15 అంతస్తులను రోజుకు ఏడుసార్లు ఎక్కడ , దిగడం చేయించేవారు. ఈ కఠిన శిక్షలను తట్టుకోలేక, రాజస్థాన్‌కు చెందిన కొంతమంది యువకులు లావోస్‌లోని ఇండియన్ ఎంబసీని ఆశ్రయించారు. హైదరాబాద్‌ యువకులు ధైర్యం చేసి ఎంబసీకి మెయిల్‌ చేయడంతో అక్కడి అధికారులు స్పందించి, యువకుల్ని విడిపించారు. వారి పాస్‌పోర్టులు సిద్ధం చేసి, వారు థాయిలాండ్‌ మీదుగా బ్యాంకాక్‌ చేరుకుని, ఆగస్టు 24న హైదరాబాద్‌ వచ్చారు. ఈ సంఘటనపై ఫాజిల్‌ఖాన్, సమీ, దావూద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.