PIB Fact Check: మోదీ పేరుతో వైరల్ వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటూ PIB ఫ్యాక్ట్ చెక్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం కీలక వివరణ ఇచ్చింది. అవన్నీ పూర్తిగా నకిలీ ఏఐ (Fake AI) వీడియోలేనని, కృత్రిమ మేధస్సు (AI) సాయంతో సృష్టించినవేనని స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న వీడియోల్లో చూపినట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ గానీ, కేంద్ర మంత్రులు గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పీఐబీ వెల్లడించింది. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
వివరాలు
పాకిస్థాన్ నెట్వర్క్ల పాత్రపై పీఐబీ వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలను ఆసరాగా చేసుకుని పాకిస్థాన్కు చెందిన కొన్ని సోషల్ మీడియా నెట్వర్క్లు (Pakistani Handles) ఈ నకిలీ వీడియోలను విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది.
ప్రజలు ఇలాంటి వీడియోలను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మార్ఫింగ్ చేసిన అసలు వీడియోలు ఇవే
ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోను, అలాగే ఇటీవల పార్లమెంట్ వెలుపల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) మాట్లాడిన వీడియోను ఏఐ సాయంతో మార్ఫింగ్ చేసి ఈ ఫేక్ వీడియోలు రూపొందించినట్లు పీఐబీ వెల్లడించింది.
వివరాలు
ఫేక్ కంటెంట్ కనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి
కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద లేదా ఫేక్ కంటెంట్ సోషల్ మీడియాలో కనిపిస్తే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్ చెక్కు తెలియజేయాలని అధికారులు ప్రజలను కోరారు.
ఇందుకోసం WhatsApp: +91 8799711259 లేదా Email: [factcheck@pib.gov.in](mailto:factcheck@pib.gov.in) ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
ప్రజలు సమాచారం నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే వాటిని షేర్ చేయాలని పీఐబీ విజ్ఞప్తి చేసింది.