Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్ భరోసా
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి తమకు గొప్ప ఆస్తి అని పేర్కొంటూ.. హైదరాబాద్లో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసి జీవిస్తున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందే అవకాశముందని అన్నారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సదుపాయాలన్నింటినీ ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన వసతులపై సూచనలు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, పరిశ్రమల శాఖ మంత్రి ప్రతి రెండు నెలలకు ఒకసారి, తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి పారిశ్రామికవేత్తలతో సమావేశమై సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.
వివరాలు
పెట్టుబడులు పెట్టాలి
తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
కృత్రిమ మేధ (AI) విస్తరణతో వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్న సీఎం.. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ'ని ఏర్పాటు చేసి, మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులనే బోధిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ డేటా సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మారుతోందని సీఎం వెల్లడించారు.
అమెజాన్ రాష్ట్రంలో డేటా సెంటర్ల కోసం రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెడుతుండగా, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్లతో మరో భారీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తోందని చెప్పారు.
వివరాలు
తెలంగాణ పారిశ్రామిక విధానాలపై సీఐఐ ప్రశంసలు
సీఐఐ నార్తర్న్ రీజియన్ ఛైర్మన్ పునీత్ కౌరా మాట్లాడుతూ.. తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని ప్రశంసించారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహకారంతో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (GCCs) హైదరాబాద్కు వరుసగా వస్తున్నాయని అన్నారు.
పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం, అత్యుత్తమ మౌలిక వసతులు, ప్రభుత్వ సహాయ సహకారాలు తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ఈ కారణాల వల్లే తమ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించామని, రాష్ట్రంలోని పారిశ్రామిక అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయడానికే ఇక్కడికి వచ్చామని పునీత్ కౌరా తెలిపారు.