
Rain Alert: తెలంగాణ, ఏపీలలో ఈరోజు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శాఖ వివరాల ప్రకారం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం చోటు చేసుకోనుంది. ఈ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ను ప్రకటించింది. ఇదిలా ఉంటే, నిన్న కూడా జనగాం, యాదాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో 8.5 సెం.మీ. వర్షపాతం నమోదవగా, ఉప్పల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో 6 సెం.మీ. వర్షం పడింది.
వివరాలు
ఈ ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం
ఆదివారం నుంచి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభమైనప్పటికీ, వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. రాబోయే కొన్ని రోజుల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఇవాళ వర్షాలు పడతాయని అంచనా. మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.