Andhra Pradesh: రాయలసీమలో ఎండలు, కోస్తాలో జల్లులు.. తాజా వాతావరణ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో సోమవారం తీవ్ర ఎండలు నమోదయ్యాయి. అక్కడ భానుడు నిప్పులు కురిపించడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా అనంతపురంలో 38.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇక కోస్తా ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. వాతావరణంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో సోమవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడినట్లు సమాచారం.
వివరాలు
వర్షాలపై వాతావరణ శాఖ అంచనా
రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎండ తీవ్రత తగ్గే సూచనలు ఇంకా రాబోయే ఐదు రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత క్రమంగా తగ్గే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 2 నుంచి 3 డిగ్రీల వరకు పడిపోతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.