UK meet: హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా అవసరం: యుకే సమావేశంలో భారత్ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకా రవాణా జరగాలని భారత్ పిలుపునిచ్చింది. యుకే ఆధ్వర్యంలో జరిగిన బహుళ దేశాల వర్చువల్ సమావేశంలో పాల్గొన్న భారత్, ఈ ఘర్షణల వల్ల ప్రాణాలు కోల్పోయిన నావికులు ఉన్న ఏకైక దేశం తామేనని తెలిపింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి భారత తరఫున పాల్గొని, సమస్య పరిష్కారానికి దౌత్యపరమైన మార్గమే సరైనదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు తగ్గించడం, చర్చలు కొనసాగించడం ద్వారా పరిష్కారం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభం భారత ఇంధన భద్రతపై ప్రభావం చూపుతోందని, గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడుల్లో ఇప్పటివరకు కనీసం ముగ్గురు భారతీయ నావికులు మరణించారని ప్రభుత్వం వెల్లడించింది.
వివరాలు
చర్చల ఫలితంగా ఆరు భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయి: విదేశాంగశాఖ
ఇక హోర్ముజ్ మార్గాన్ని తిరిగి తెరవడం కోసం భారత్ ఇరాన్ సహా మధ్యప్రాచ్య దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే ఆ చర్చల ఫలితంగా ఆరు భారత నౌకలు సురక్షితంగా ఆ జలసంధిని దాటినట్లు విదేశాంగశాఖ తెలిపింది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ కొన్ని దేశాలకు మాత్రమే అనుమతి ఇస్తుండగా, భారత్కు కూడా సరుకు నౌకలకు మార్గం కల్పించడం గమనార్హం. ఇదిలా ఉండగా, యుకే నిర్వహించిన ఈ సమావేశానికి అమెరికా హాజరు కాలేదు. హోర్ముజ్ మార్గాన్ని రక్షించడం తమ బాధ్యత కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
వివరాలు
ఇరాన్ చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
యుకే విదేశాంగ కార్యదర్శి ఇవెట్ కూపర్ మాట్లాడుతూ, హోర్ముజ్ మార్గాన్ని తిరిగి ప్రారంభించేందుకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంకల్పాన్ని ఈ సమావేశం చూపిస్తుందని చెప్పారు. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందని, చమురు,ఆహార ధరలు పెరిగి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, వ్యాపారాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో సైనిక చర్యల కంటే రాజకీయ, దౌత్యపరమైన పరిష్కారాలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.