Rajnath Singh: భారత్ స్పేస్ మిషన్లలో దూసుకెళ్తుంటే.. పాక్ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది: రాజ్నాథ్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్ అభివృద్ధి, ఆవిష్కరణలు, అంతరిక్ష రంగంలో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదం, చొరబాట్లకే ప్రాధాన్యం ఇస్తోందని ఆయన మండిపడ్డారు. పాకిస్థాన్తో ఎలాంటి చర్చలు జరిగినా అవి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) అంశంపైనే ఉంటాయని స్పష్టం చేశారు.
వివరాలు
అభివృద్ధి దిశగా భారత్.. ఉగ్రవాద దిశగా పాక్
కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద 27వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న తేడాను వివరించారు.
భారత్ ఇన్నోవేషన్, స్టార్టప్లు, స్పేస్ మిషన్లలో ముందుకు సాగుతుంటే.. పాకిస్థాన్ మాత్రం చొరబాట్లకు కొత్త మార్గాలను వెతుకుతోందని అన్నారు.
మన దేశం డేటా సెంటర్లను నిర్మిస్తుంటే.. పాకిస్థాన్ ఉగ్రవాద కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.
వివరాలు
పీవోకేపైనే చర్చలు
పాకిస్థాన్తో చర్చలు జరగాల్సి వస్తే అవి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) గురించే తప్ప మరే అంశంపైనా కాదని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పీవోకేను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకుందని ఆరోపించారు.
కార్గిల్ విజయం భారత గర్వకారణం
1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయాన్ని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆ విజయం భారతమాత కిరీటంలో పొదిగిన ఓ అమూల్యమైన వజ్రమని అభివర్ణించారు.
వివరాలు
ఉగ్రవాదంపై పాక్కు హెచ్చరిక
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వ విధానంలో భాగంగా మార్చుకుందని రక్షణ మంత్రి విమర్శించారు.
ఉగ్రవాదులను అడ్డుపెట్టుకుని భారత్ను బెదిరించాలనే ప్రయత్నాలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రపంచమంతా చూసిందని అన్నారు.
పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా.. భారత సైన్యం వారి ఊహలకు అందని రీతిలో ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు.
వివరాలు
ప్రతి ఉగ్రదాడికి భారత్ గట్టి సమాధానం
భారత్పై జరిగిన ప్రతి ప్రధాన ఉగ్రదాడికి తగిన సమాధానం ఇచ్చిన విషయాన్ని రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు.
ఉరి సెక్టార్పై దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్
పుల్వామా ఉగ్రదాడి అనంతరం వైమానిక దాడులు
పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు పేర్కొంటూ, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.
అమరవీరులకు నివాళి
27వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ధీరజ్ సేథ్, లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఇతర సైనిక ఉన్నతాధికారులు కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.