LOADING...
Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ
20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ

Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ

వ్రాసిన వారు Moogati Shabari
May 21, 2026
11:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అంకె గౌడ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ అంకె గౌడ ? సమాజానికి ఏం చేశారు? కర్ణాటక మాండ్య జిల్లాలోని పాండవపురలో నివసించే అంకె గౌడ, రిటైర్డ్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి. ఆయన గత 50 ఏళ్లకు పైగా అద్భుతమైన పుస్తకాల సేకరణతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గౌడ వద్ద సుమారు 20 లక్షల పుస్తకాలు ఉన్న భారీ గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయం ఎవరైనా వచ్చి పుస్తకాలు తీసుకుని చదువుకునేలా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆయనకు 2024 జనవరిలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించారు. ఈ నెల 25న జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

వివరాలు

ఆయన ఇల్లే ఓ గ్రంథాలయం..

అయితే ఆయన గ్రంథాలయం సాధారణ లైబ్రరీలా క్రమబద్ధంగా ఉండదు. అక్కడ లైబ్రేరియన్ కూడా లేరు. పుస్తకాలు అలమారాల్లోనే కాకుండా నేలపై కూడా గుట్టలుగా ఉన్నాయి. ఇంకా దాదాపు 8 లక్షల పుస్తకాలు బయట సంచుల్లోనే తెరవకుండా ఉన్నాయి. అయినప్పటికీ, అక్కడికి వచ్చే పాఠకులు గౌడ సహాయంతో కావాల్సిన పుస్తకాలను సులభంగా వెతుక్కుంటారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఉన్న గౌడ చిన్నప్పటి నుంచి పుస్తకాలపై మక్కువతో పెరిగారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయనకు పుస్తకాలు ఒక విలాసంగా ఉండేవి. ఈ విషయంపై ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "మాకు చదవడానికి పుస్తకాలు దొరికేవి కావు. కానీ నాకు ఎప్పుడూ చదవాలనే ఆసక్తి ఉండేది. జ్ఞానం సంపాదించాలి అనే కోరిక ఉండేది" అని చెప్పారు.

వివరాలు

చదువు అయ్యాక కండక్టర్‌గా ఉద్యోగం..

భారత స్వాతంత్ర సమరయోధులు, ఆధ్యాత్మిక నాయకుల గురించి చదివే ఆసక్తి ఆయనను గ్రామీణ విద్యార్థుల కోసం పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచనకు తీసుకెళ్లింది. చదువు పూర్తయ్యాక గౌడ బస్ కండక్టర్‌గా పనిచేశారు. తర్వాత ఒక మాజీ టీచర్ ప్రోత్సాహంతో మళ్లీ ఉన్నత విద్య కొనసాగించారు. పాండవపుర చక్కెర ఫ్యాక్టరీలో పనిచేస్తూ తన జీతంలో మూడో వంతు పుస్తకాలకే ఖర్చు చేసేవారు. అదనపు ఆదాయం కోసం పాడి పశువులను పెంచడం, ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా పని చేయడం కూడా చేశారు. అయినా అప్పటికి సుమారు 50 వేల పుస్తకాలు చేరడంతో వాటిని ఉంచడానికి స్థలం సమస్యగా మారింది.

Advertisement

వివరాలు

15,800 చదరపు అడుగుల గ్రంథాలయం ఏర్పాటు..

తరువాత ఆయన స్నేహితుల ద్వారా ప్రముఖ లిక్కర్ వ్యాపారి దివంగత హరి ఖొడేను కలుసుకున్నారు. ఈ విషయంపై గౌడ మాట్లాడుతూ, "ఆయన నాకు ఏమి కావాలో అడిగారు. నాకు డబ్బు వద్దు. నాకు కావాల్సింది ఒక గ్రంథాలయం నిర్మించడమే అని చెప్పాను" అని వివరించారు. దీంతో ఖొడే ఆర్థిక సహాయంతో పెద్ద భవనం నిర్మించబడింది. అదే తర్వాత గౌడ.. 15,800 చదరపు అడుగుల గ్రంథాలయంలో భాగమైంది. అనంతరం మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి సందర్శించిన తర్వాత మరో రెండు భవనాల కోసం నిధులు మంజూరు చేశారు.

Advertisement

వివరాలు

లైబ్రరీని నడపాలని ప్రభుత్వానికి విన్నపం..

ఇక తన గ్రంథాలయం భవిష్యత్తు గురించి గౌడ మాట్లాడుతూ, "నేను నా బాధ్యతను పూర్తి చేశాను. కానీ ఇప్పుడు నాకు శక్తి లేదు. ఇక దీన్ని ప్రభుత్వం లేదా ప్రజలే ముందుకు తీసుకెళ్లాలి" అని అన్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన #Peoplespadma (పీపుల్స్ పద్మ) ఇనిషియేటివ్ తర్వాత ఈ పద్మశ్రీ గుర్తింపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రామీణ స్థాయి నుంచి వచ్చే ప్రతిభావంతులను గుర్తించేందుకు, ప్రజల స్వీయ నామినేషన్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చారు.

Advertisement