Modi Press Meet: ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? భారత విదేశాంగ శాఖ వివరణ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి తెరపైకి వచ్చింది. ప్రధాని మోదీ సాధారణంగా మీడియా సమావేశాలు (ప్రెస్ మీట్లు) ఎందుకు నిర్వహించరని న్యూజిలాండ్కు చెందిన ఓ జర్నలిస్టు భారత దౌత్య ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రశ్నకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ సమాధానం ఇచ్చారు. మోదీ ప్రజలతో నేరుగా అనుసంధానం కావడానికే ప్రాధాన్యం ఇస్తారని ఆయన వివరించారు.
వివరాలు
మోదీ సంప్రదాయ మీడియా సమావేశాల కంటే ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్కు ఎక్కువ ప్రాధాన్యం
టాండన్ మాట్లాడుతూ,"ప్రధాని మోదీ ఆదర్శవంతమైన నాయకుడు.భారత జనాభాలో అధిక శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారు రాజకీయ నాయకులతో నేరుగా మాట్లాడాలని, ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటారు. తమ అభిప్రాయాలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా నాయకులకే తెలియజేయాలనే భావన వారిలో ఎక్కువగా ఉంటుంది"అని చెప్పారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవడం, వారితో నేరుగా సంభాషించడం మోదీ నాయకత్వ శైలిలో కీలక భాగమని టాండన్ పేర్కొన్నారు. అందుకే ఆయన సంప్రదాయ మీడియా సమావేశాల కంటే ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిపారు. అలాగే, వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన మోదీ, దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రి పదవిలో కొనసాగుతున్న నేతల్లో ఒకరని రుద్రేంద్ర టాండన్ గుర్తు చేశారు.