Smart Lockdown: పాకిస్థాన్ తరహా 'స్మార్ట్ లాక్డౌన్' దిశగా భారత్..? మోదీ 7 విజ్ఞప్తులపై దేశవ్యాప్తంగా చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా ఇంధనం, వాయువు సరఫరాల్లో ఏర్పడిన అంతరాయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న సమస్యల కారణంగా ఇంధన రవాణా దెబ్బతింది. దీంతో ఇంధనం, ఆహారం, రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ప్రపంచ సరఫరా వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి పాకిస్థాన్, యూఏఈ వంటి దేశాల ఆర్థిక పరిస్థితులపై మరింత భారం మోపుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పొదుపు సూచనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
వివరాలు
"స్మార్ట్ లాక్డౌన్" విధానాన్ని పరిశీలిస్తుందా
ఇంధన వినియోగాన్ని తగ్గించడం, బంగారం కొనుగోళ్లను వాయిదా వేయడం, ఇంటి నుంచే పని విధానాన్ని ప్రోత్సహించడం, విదేశీ పర్యటనలను తగ్గించుకోవడం వంటి అంశాలపై ప్రధాని మోదీ ప్రజలకు ఏడు ముఖ్య విజ్ఞప్తులు చేశారు. ఈ సూచనలు కోవిడ్ లాక్డౌన్ కాలాన్ని గుర్తు చేస్తున్నాయంటూ సామాజిక వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా పాకిస్థాన్ తరహాలో "స్మార్ట్ లాక్డౌన్" విధానాన్ని పరిశీలిస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వివరాలు
పాకిస్థాన్లో 'స్మార్ట్ లాక్డౌన్' అమలు
ఇంధన కొరతను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్, ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా "స్మార్ట్ లాక్డౌన్" అమలు చేస్తోంది. ఈ ఆదేశాల ప్రకారం పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిల్గిత్-బాల్టిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలు రాత్రి 8 గంటలకల్లా మూసివేయాలి. అదేవిధంగా బేకరీలు, భోజనశాలలు, తందూర్ కేంద్రాలు, ఆహార విక్రయ కేంద్రాలు, వివాహ వేదికలు రాత్రి 10 గంటలలోపు కార్యకలాపాలు ముగించాల్సి ఉంటుంది. ప్రైవేట్ ఇళ్లలో జరిగే వివాహ వేడుకలకు కూడా ఇదే సమయ పరిమితి అమలు చేస్తున్నారు. పెరుగుతున్న చమురు ధరలు, ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ ఈ చర్యలు చేపట్టింది.
వివరాలు
మోదీ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చర్చ
దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని, పొదుపు అలవాటు చేసుకోవాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ చేసిన పిలుపు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. చాలామంది ఈ సూచనలను కోవిడ్-19కాలంలో అమలైన ఆంక్షలు, జీవనశైలి మార్పులతో పోలుస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో పశ్చిమ ఆసియా పరిస్థితులపై మాట్లాడిన ప్రధాని మోదీ,కోవిడ్ కాలాన్ని ప్రస్తావించారు. అయితే కోవిడ్ తరహా లాక్డౌన్ను అమలు చేస్తామని కాకుండా, ప్రపంచ సంక్షోభ సమయంలో భారత్ ఎలా సమర్థంగా ఎదుర్కొన్నదో గుర్తు చేయడానికే ఆ ఉదాహరణ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఐక్యత ఎంతో ముఖ్యమని ప్రధాని పేర్కొన్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రజలను అప్రమత్తం చేశారు.
వివరాలు
ప్రజలకు ప్రధాని మోదీ చేసిన 7 ప్రధాన విజ్ఞప్తులు
ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధాని చేసిన ముఖ్య విజ్ఞప్తులు ఇవీ.. వంట నూనె వినియోగాన్ని తగ్గించుకోవాలి ప్రజా రవాణాను ఎక్కువగా ఉపయోగించాలి కార్లను కలిసి వినియోగించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలి సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలి ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలి విదేశీ పర్యటనలు, అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి దేశంపై దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడమే ఈ సూచనల ప్రధాన ఉద్దేశమని ప్రధాని మోదీ వెల్లడించారు.