Faridabad: ఫరీదాబాద్ స్కూల్లో టీచర్ దారుణ హత్య.. 30 సెకన్లలో 30 కత్తిపోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది. సంధ్య (29) అనే మహిళా ఉపాధ్యాయురాలిని ఓ యువకుడు స్కూల్ ప్రాంగణంలోనే కత్తితో అత్యంత కిరాతకంగా దాడి చేసి హత్య చేశాడు. ముఖానికి మాస్క్ ధరించి పాఠశాలలోకి వచ్చిన నిందితుడు,ఆమెను బయటకు పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తనపై వేధింపుల కేసు నమోదు చేయడంతో ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫరీదాబాద్లోని సిక్రోనా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పోలీసు అవుట్పోస్ట్కు అత్యంత సమీపంలోనే పాఠశాల ఉండటం గమనార్హం.
వివరాలు
30 సెకన్ల వ్యవధిలోనే సంధ్య ముఖం,మెడ, ఛాతీపై 30కి పైగా కత్తిపోట్లు
బుధవారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో మాస్క్ ధరించిన యువకుడు స్కూల్ గేటు వద్దకు వచ్చి, సంధ్యతో మాట్లాడాలని సిబ్బందికి తెలిపాడు.
సమాచారం అందుకున్న ఆమె బయటకు రాగానే నిందితుడు ఒక్కసారిగా కత్తితో దాడి ప్రారంభించాడు.
పోలీసుల వివరాల ప్రకారం, కేవలం 30 సెకన్ల వ్యవధిలోనే సంధ్య ముఖం,మెడ, ఛాతీపై 30కి పైగా కత్తిపోట్లు పొడిచాడు.
ఆమె తీవ్రంగా గాయపడి కిందపడిపోయినా దుండగుడు దాడిని ఆపకుండా విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూనే ఉన్నాడు.
వివరాలు
పాఠశాల అడ్మినిస్ట్రేటర్ పై కూడా కత్తితో దాడి
ఈ ఘటన మొత్తం పాఠశాలలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఫుటేజీలో లాబీలో వేచి ఉన్న నిందితుడు సంధ్యను బయటకు రావాలని సైగ చేయడం,ఆమె బయటకు వచ్చిన వెంటనే మెడ పట్టుకుని బయటకు లాగి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది.
ఆమె నేలపై కూలిపోయిన తర్వాత కూడా అతడు దాడి కొనసాగించాడు.
అరుపులు విన్న పాఠశాల అడ్మినిస్ట్రేటర్ వెంటనే బయటకు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు అతనిపై కూడా కత్తితో దూసుకొచ్చాడు.
దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎన్డీటీవీ కథనం ప్రకారం, పాఠశాల అడ్మినిస్ట్రేటర్ మాట్లాడుతూ, తాను కార్యాలయంలో ఉండగా బయట నుంచి కేకలు వినిపించాయని తెలిపారు.
బయటకు వచ్చి చూసేసరికి ఓ వ్యక్తి సంధ్యపై పదేపదే కత్తితో దాడి చేస్తున్నాడని చెప్పారు.
వివరాలు
ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులో నిందితుడు
తాను గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు తనవైపు తిరిగాడని, కర్ర తీసుకురావడానికి వెనక్కి తిరిగేలోపే మళ్లీ సంధ్యపై దాడి చేసి, అనంతరం నంబర్ ప్లేట్ లేని మోటార్సైకిల్పై అక్కడి నుంచి పరారైనట్లు వివరించారు.
తీవ్ర గాయాలతో ఉన్న సంధ్యను వెంటనే సమీపంలోని అల్ ఫలా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటన జరిగిన రెండు గంటల్లోనే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కోట్ గ్రామానికి చెందిన అమిత్ (21)గా అతడిని గుర్తించారు. విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
వేధింపులపై ఫిర్యాదు చేయడంతో పగ పెంచుకున్న నిందితుడు
పోలీసుల ప్రాథమిక విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రెండేళ్ల క్రితం సంధ్యకు అమిత్తో పరిచయం ఏర్పడిందని, అప్పటి నుంచి ఆమెను వేధిస్తూ వెంటపడుతున్నాడని తెలిపారు.
అతడి వేధింపులు ఎక్కువ కావడంతో కొద్ది రోజుల క్రితం సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అమిత్ బహిరంగంగా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
అయితే ఆ ఘటనతో అవమానంగా భావించిన అతడు ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు ఇతర ఆధారాలను కూడా సేకరిస్తున్నారు.