Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి పూటల్లో కూడా మహిళలు పని చేసే అవకాశాన్ని కల్పిస్తూ అనుమతినిచ్చింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, వారానికి 48 గంటల పని విధానం యథాతథంగా కొనసాగుతుంది. అయితే కార్మికుల రోజువారీ పని గంటలను 8 నుంచి 10కి పెంచారు. ఇప్పటి వరకు వారానికి 14 గంటల ఓవర్టైమ్ ఉండగా, ఇకపై మూడు నెలల కాలానికి గరిష్టంగా 144 గంటల ఓవర్టైమ్ అనుమతించబడుతుంది. మహిళా ఉద్యోగుల సమ్మతితో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పని చేసేందుకు అనుమతించేలా ప్రభుత్వం చట్టాన్ని సవరించింది.
Details
అన్ని రకాల సదుపాయాలు కల్పించేందుకు సిద్ధం
అయితే, నైట్ డ్యూటీలో పని చేసే సిబ్బందికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాల్సిందిగా స్పష్టం చేసింది. అలాగే 20 మంది లోపు సిబ్బంది ఉన్న సంస్థలకు కొన్ని రిజిస్టర్ల నిర్వహణలో మినహాయింపు ఇచ్చింది. అయితే ఉద్యోగుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్, సెలవులు, తొలగింపుల వంటి రికార్డులను మాత్రం తప్పనిసరిగా నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద, ఈ సవరణలతో ఏపీ ప్రభుత్వం పరిశ్రమల్లో సౌలభ్యం పెంపుతో పాటు మహిళా ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది.