Loading...
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం
బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం

BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్‌కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2026
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది. ఐదేళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సదస్సు సందర్భంగా ఆయా దేశాధినేతలు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈసారి బ్రిక్స్ సదస్సు ప్రధాన అంశంగా "స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిర అభివృద్ధి కోసం నిర్మాణం" అనే థీమ్‌ను నిర్ణయించారు. సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి.

వివరాలు 

SCO సదస్సు సందర్భంగా జిన్‌పింగ్,మోదీ సమావేశం 

షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే, 2019 అక్టోబర్ తర్వాత ఆయన తొలి భారత పర్యటనగా నిలుస్తుంది.

అప్పట్లో తమిళనాడులోని మామల్లపురంలో ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

అయితే ఆ తర్వాత లడాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంట చైనా బలగాల చొరబాటుతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సరిహద్దు వివాదంలో 2024 చివర్లో ఇరు దేశాలు పరిష్కారానికి అంగీకరించడంతో పరిస్థితులు కొంత మెరుగయ్యాయి.

అనంతరం 2024 అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో జరిగిన సమావేశంలో మోదీ, షీ జిన్‌పింగ్ చర్చలు జరిపారు.

చివరిసారిగా 2025 ఆగస్టులో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశమయ్యారు.

వివరాలు 

బ్రిక్స్ సదస్సుపై పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం

ఈసారి బ్రిక్స్ సదస్సుపై పశ్చిమాసియా పరిస్థితుల ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంది.

2024 జనవరిలో బ్రిక్స్‌లో చేరిన ఇరాన్,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)ప్రస్తుతం పశ్చిమాసియా వివాదాల విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.

2026 ఫిబ్రవరిలో అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్‌పై జరగడంతో టెహ్రాన్, అబుదాబీలు వేర్వేరు వైఖరులు అవలంబించాయి.

ఈ విభేదాలను తగ్గించే దిశగా భారత్ మధ్యవర్తిత్వం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

పాలస్తీనా అంశం, రెండు దేశాల పరిష్కారంపై బ్రిక్స్ ఉమ్మడి ప్రకటనలో ఉండే భాష విషయంలో కూడా యూఏఈ అభ్యంతరాలు వ్యక్తం చేయగా, మిగిలిన సభ్య దేశాలు దానికి వ్యతిరేకంగా నిలిచాయి.

ఈ కారణంగానే 2026 మేలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఉమ్మడి ప్రకటన లేకుండానే ముగిసింది.

ADVERTISEMENT

వివరాలు 

ఇరాన్,భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు

ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ భారత పర్యటన సందర్భంగా పశ్చిమాసియా తాజా పరిస్థితులపై భారత నాయకత్వానికి వివరించనున్నట్లు సమాచారం.

అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చలు జరగనున్నాయి.

అమెరికా ఆంక్షల కారణంగా 2019మే నుంచి భారత్ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది.

దీంతో పాటు చాబహార్ పోర్టు అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా ప్రభావం పడింది.

ఈ నేపథ్యంలో ఇరుదేశాలు సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే మార్గాలపై చర్చించే అవకాశం ఉంది.

బ్రిక్స్ సభ్యదేశాలతో పాటు కొన్ని సభ్యేతర దేశాల ప్రభుత్వాధినేతలను కూడా భారత్ ఈ సదస్సుకు ఆహ్వానించింది.

ప్రస్తుతం బిమ్‌స్టెక్(BIMSTEC)అధ్యక్ష దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రహ్మాన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం.

ADVERTISEMENT