LOADING...
Delhi: ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి
ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి

Delhi: ఢిల్లీకి పొంచివున్న యమునా వరద ముప్పు.. 63 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ వర్షాలు,వరదల కారణంగా యమునా నది 63 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరింది,ఇది ఢిల్లీలో తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. హత్నికుండ్ బ్యారేజ్ ద్వారా భారీగా నీటిని విడుదల చేసిన తర్వాత యమునా నది ప్రమాదకర స్థాయిని దాటింది. సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 1 గంటకు నది నీటి మట్టం 207 మీటర్లను అధిగమించింది. రాత్రి 10 గంటలకు ఇది 207.43 మీటర్లకు చేరింది.1963 తర్వాత ఇదే స్థాయికి నది చేరడం మూడవసారి. ఈ వరదల కారణంగా ఢిల్లీలోని రింగ్ రోడ్,సివిల్ లైన్స్,బేలా రోడ్,సోనియా విహార్ వంటి ప్రాంతాలు నీటిలో మునిగాయి. సుమారు 12,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

వివరాలు 

వరదల ముప్పు నుంచి 12 వేల మందిని రక్షించాం : అమోల్ శ్రీవాస్తవ

సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనాల ప్రకారం, గురువారం నాటికి నీటి స్థాయి 207.48 మీటర్లకు చేరే అవకాశం ఉంది. ఇది 1978లో వచ్చిన చారిత్రక వరద స్థాయిలకు దగ్గరగా ఉంది. వరదల కారణంగా మజ్ను కాటిల్లా,సలీంగర్ బైపాస్ మధ్య ట్రాఫిక్‌లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,నిగంబోధ్ ఘాట్, గీతా కాలనీలోని దహన సంస్కారాలను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిలిపివేసింది. జైత్‌పూర్‌లోని విశ్వకర్మ కాలనీ, సివిల్ లైన్స్‌లోని మొనాస్టరీ మార్కెట్లలోకి కూడా వరద నీరు చేరింది. వరద పరిస్థితులను పర్యవేక్షిస్తున్న నోడల్ అధికారి, జిల్లా మేజిస్ట్రేట్ అమోల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ వరదల ముప్పు నుంచి 12 వేల మందిని రక్షించినట్లు తెలిపారు.

వివరాలు 

భారత వాతావరణ శాఖ హెచ్చరిక 

బాధితుల కోసం 38 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. హిమాలయాల్లోని ఎగువ యమునా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు హత్నికుండ్ బ్యారేజ్ ద్వారా 1.6 లక్షల క్యూసెక్కుల నీరు, రాత్రి 7 గంటలకు 1.78 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సాధారణంగా ఈ బ్యారేజ్ నుండి 50,000 క్యూసెక్కుల కన్నా తక్కువ నీరు మాత్రమే విడుదల అవుతుంది. ఇలాంటి భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీలో మరిన్ని ప్రాంతాలు ముంచుకుపోవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.