Andhra Pradesh: రయ్.. రయ్.. పీఎం-ఈ డ్రైవ్.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన నగరాలు, జాతీయ రహదారుల వెంట ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది.
వివరాలు
మూడు డిస్కంల పరిధిలో 131 స్టేషన్లు
రాష్ట్రంలోని మూడు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలో మొత్తం 444 లొకేషన్లను అధికారులు గుర్తించారు.
వీటిలో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 48, ఈపీడీసీఎల్ పరిధిలో 18, ఎస్పీడీసీఎల్ పరిధిలో 65 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
మొత్తం 131 స్టేషన్లలో 117 జాతీయ రహదారుల వెంట ఏర్పాటు కానున్నాయి.
వివరాలు
444 ప్రాంతాల పరిశీలన.. తొలి దశలో 131కు గ్రీన్సిగ్నల్
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల పరిధి, ప్రధాన నగరాలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ప్రభుత్వ భూముల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన 444 లొకేషన్లను అధికారులు గుర్తించారు.
ఈ ప్రతిపాదనలను నెడ్క్యాప్ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు పంపింది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు అమలుకు బీహెచ్ఈఎల్ను నోడల్ ఏజెన్సీగా కేంద్రం నియమించింది.
నెడ్క్యాప్ ప్రతిపాదించిన ప్రాంతాల్లో 244 లొకేషన్లపై బీహెచ్ఈఎల్ ఫీజిబిలిటీ అంచనా నిర్వహించింది.
పీఎం-ఈ డ్రైవ్ మార్గదర్శకాల ప్రకారం స్థల విస్తీర్ణం, రాకపోకల సౌలభ్యం, విద్యుత్ కనెక్షన్, అదనపు సివిల్ పనుల అవసరం, సైట్ విజిబిలిటీ వంటి అంశాలను పరిశీలించిన అనంతరం తొలి దశలో 131 లొకేషన్లలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది.
వివరాలు
సబ్సిడీ పొందాలంటే ముందుగా పనులు పూర్తి చేయాలి
దీనికి అనుగుణంగా నెడ్క్యాప్ సవరించిన ప్రతిపాదనలు పంపింది. మిగిలిన 200 లొకేషన్లను రెండో దశలో పరిశీలించనున్నారు.
దేశవ్యాప్తంగా పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా కేటాయించింది.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి అనుమతులు ఇచ్చింది. ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఈవీ సప్లై ఎక్విప్మెంట్ ఖర్చులో నిబంధనల మేరకు సబ్సిడీ అందించనుంది.
అయితే పనులను ముందుగా పూర్తి చేసే రాష్ట్రాలకే ముందుగా సబ్సిడీ విడుదల చేసే నిబంధనను కేంద్రం అమలు చేస్తోంది.
వివరాలు
రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 577 ఛార్జింగ్ కేంద్రాలు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు 577 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వీటిలో 306 ద్విచక్ర వాహనాలు, ఆటోలకు, 266 కార్లకు, 5 బస్సులు, ట్రక్కులకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.62.94 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇందులో రూ.39.79 కోట్లు కేంద్ర సబ్సిడీగా, మిగిలిన రూ.23.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు అమలు బాధ్యతను నెడ్క్యాప్కు అప్పగించారు.