Udaipur: రంగుల పండుగకు గ్లోబల్ క్రేజ్.. రాజస్థాన్ నగరాలకు టూరిస్టుల వెల్లువ
ఈ వార్తాకథనం ఏంటి
హోలీ పండుగ దగ్గరపడుతుండటంతో దేశవ్యాప్తంగా టూరిజం రంగంలో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. రంగులాట మాత్రమే కాదు... భారతదేశంలో జరిగే సంప్రదాయ, రాజసపు హోలీ వేడుకలను ప్రత్యక్షంగా చూడాలని విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. అగోడా సెర్చ్ డేటా ప్రకారం రాజసపు వారసత్వం, దేవాలయ వేడుకలు, కమ్యూనిటీ సెలబ్రేషన్లకు ప్రసిద్ధి చెందిన నగరాలపై ఈసారి భారీగా సెర్చ్లు పెరిగాయి. ముఖ్యంగా ఉదయపూర్లో విదేశీ సెర్చ్లు 459 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకోగా, జైపూర్లో 191 శాతం వృద్ధి నమోదైంది. మలేషియా, థాయిలాండ్, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా దేశాల నుంచి భారత హోలీకి భారీగా ఆసక్తి కనబడుతోంది.
వివరాలు
దేవాలయ పట్టణాలు కూడా తగ్గేదేలే..
దేశీయ టూరిజంలో కూడా రాజస్థాన్ టాప్లో నిలిచింది. గతేడాది హోలీతో పోలిస్తే జైపూర్లో వసతి సెర్చ్లు 282 శాతం పెరిగాయి. అంబేర్ కోట వంటి చారిత్రక కట్టడాలు, రాజభవనాల్లో జరిగే గ్రాండ్ హోలీ వేడుకలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఉదయపూర్లో 233 శాతం, పుష్కర్లో 195 శాతం సెర్చ్లు పెరిగాయి. హోలీ హడావుడిలో దేవాలయ పట్టణాలు కూడా తగ్గేదేలే అన్నట్టు దూసుకుపోతున్నాయి. వృందావన్లో 126 శాతం,మథురలో 109 శాతం వృద్ధి నమోదైంది. శ్రీకృష్ణ జన్మభూమిగా పేరుగాంచిన మథురలో జరిగే వీధి హోలీ, ఆలయ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
వివరాలు
గ్లోబల్ టూరిజాన్ని మరింత బలోపేతం చేస్తున్న భారత సాంస్కృతిక పండుగలు
దక్షిణ భారతంలో కర్ణాటకలోని హంపిలో 128 శాతం పెరుగుదల కనిపించగా, పశ్చిమ బెంగాల్లో శాంతినికేతన్లో 43 శాతం ఆసక్తి పెరిగింది. అగోడా ప్రతినిధి గౌరవ్ మాలిక్ మాట్లాడుతూ... హోలీ ఇప్పుడు దేశీయంగానే కాదు, అంతర్జాతీయంగానూ ముఖ్యమైన ట్రావెల్ సీజన్గా మారిందన్నారు. భారత సాంస్కృతిక పండుగలు గ్లోబల్ టూరిజాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ డేటా 2025 డిసెంబర్ 28 నుంచి 2026 జనవరి 28 మధ్య చేసిన సెర్చ్లను గత ఏడాది ఇదే కాలంతో పోల్చి విశ్లేషించినట్టు వెల్లడించారు.