LOADING...
Lakshadweep: లక్షద్వీప్ వెళ్లడం ఇక సులువు.. స్థానిక స్పాన్సర్‌, పోలీస్ క్లియరెన్స్ నిబంధనల రద్దు
స్థానిక స్పాన్సర్‌, పోలీస్ క్లియరెన్స్ నిబంధనల రద్దు

Lakshadweep: లక్షద్వీప్ వెళ్లడం ఇక సులువు.. స్థానిక స్పాన్సర్‌, పోలీస్ క్లియరెన్స్ నిబంధనల రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అందమైన పగడపు దీవులు, స్వచ్ఛమైన నీలి సముద్ర తీరాలతో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్షద్వీప్‌కు వెళ్లాలని చాలామంది ఎన్నాళ్లుగానో కలలు కంటుంటారు. అయితే ఇప్పటివరకు అక్కడికి వెళ్లాలంటే స్థానిక వ్యక్తి లేదా సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్ తీసుకోవడం, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ సమర్పించడం వంటి కఠిన నిబంధనలు ఉండేవి. ఈ కారణంగా పర్యాటకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చేది. తాజాగా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో లక్షద్వీప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పలు నిబంధనలకు సడలింపులు ఇస్తూ కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.

వివరాలు 

భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదు 

కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటివరకు తప్పనిసరిగా ఉన్న స్థానిక స్పాన్సర్ నిబంధనను పూర్తిగా రద్దు చేశారు. అలాగే సొంత రాష్ట్రం నుంచి తీసుకురావాల్సిన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అవసరాన్ని కూడా తొలగించారు. అయితే భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పర్యాటకులు దరఖాస్తు చేసిన తర్వాత లక్షద్వీప్ పోలీసులు స్వయంగా అంతర్గత భద్రతా పరిశీలనలు నిర్వహిస్తారు. అందువల్ల ప్రయాణ తేదీకి కనీసం 14 రోజుల ముందుగానే పర్మిట్ కోసం దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు. దరఖాస్తులో ఏ ఏ దీవులను సందర్శించాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు అక్కడ ఉండబోతున్నారు అనే వివరాలను స్పష్టంగా నమోదు చేయాలి.

వివరాలు 

అక్టోబర్ నుంచి మార్చి వరకు ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం

పర్మిట్‌లో అనుమతి లేని ఇతర దీవుల్లోకి ప్రవేశానికి అవకాశం ఉండదు. ప్రయాణ సమయంలో కవరత్తి లేదా అగత్తి దీవుల్లో గరిష్టంగా 12 గంటల వరకు మాత్రమే మధ్యంతర విరామానికి అనుమతి ఉంటుంది. ఎంట్రీ పర్మిట్ దరఖాస్తులను అధికారులు పూర్తిగా అర్హతల ఆధారంగా పరిశీలించి ఆమోదిస్తారు. అధికారిక పర్మిట్ చేతికి రాకముందే విమానాలు, వసతి గదులు బుక్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. పర్మిట్ నిరాకరణ జరిగితే చివరి నిమిషంలో రద్దుల కారణంగా ఆర్థిక నష్టం ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి మార్చి వరకు పర్యాటక రద్దీ అధికంగా ఉండటంతో ముందుగా దరఖాస్తు చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.

Advertisement

వివరాలు 

అన్ని దీవులను సందర్శించేందుకు అనుమతి ఇవ్వరు

లక్షద్వీప్ స్థానికులు, ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులను మినహాయించి భారతీయులు, విదేశీయులు సహా అందరికీ ఎంట్రీ పర్మిట్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే అన్ని దీవులను సందర్శించేందుకు అనుమతి ఇవ్వరు. భారతీయ పౌరులు కేవలం కవరత్తి, అగత్తి, బంగారం,కద్మత్, మినికాయ్ దీవులను మాత్రమే సందర్శించవచ్చు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ ప్రాంతాల్లో కఠిన నియంత్రణలు కొనసాగుతాయి. పర్యాటకులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానాల్లో పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానం ఎంచుకునేవారు అధికారిక 'ఈ-పర్మిట్ (ePermit)' పోర్టల్ లోకి వెళ్లి (https://epermit.utl.gov.in/pages/signup) అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించిన తర్వాత దరఖాస్తు పరిశీలనకు వెళ్తుంది.

Advertisement

వివరాలు 

తప్పనిసరిగా ధృవీకరణ పత్రాలు 

అనుమతి లభిస్తే ప్రయాణానికి సుమారు 15రోజుల ముందుగా ఈ-మెయిల్ ద్వారా పర్మిట్ అందుతుంది. ఆఫ్‌లైన్ విధానంలో లక్షద్వీప్ యంత్రాంగం వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు పత్రాలు డౌన్‌లోడ్ చేసుకుని కవరత్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించవచ్చు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,, ప్రభుత్వ గుర్తింపు కార్డు, ప్రయాణ టికెట్లు, అవసరమైన చోట వసతి గది ధృవీకరణ పత్రాలను తప్పనిసరిగా జతచేయాలి.

Advertisement