Thai businessman: రూ.47 కోట్ల వ్యాపారం వదిలి సన్యాసం.. థాయ్ వ్యాపారవేత్త సంచలన నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
థాయిలాండ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిరిపాంగ్ అకర్శ్రీయాక్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. కోట్ల రూపాయల విలువైన వ్యాపారాన్ని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారాలని ఆయన నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సుమారు రూ.47 కోట్ల విలువైన తన ఐస్క్రీం కంపెనీని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. సిరిపాంగ్ 1999లో ఓ ఐస్క్రీం బ్రాండ్ను ప్రారంభించారు. ఒక దశలో ఈ సంస్థకు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. అయితే కాలక్రమంలో పోటీ పెరగడంతో వ్యాపారం కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొంది. అయినప్పటికీ సంస్థ విలువ ప్రస్తుతం దాదాపు రూ.47 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి బౌద్ధ భిక్షువుగా మారాలనే ఆలోచన
అయితే వ్యాపారం కంటే ఆధ్యాత్మిక జీవితంపైనే తనకు ఆసక్తి పెరిగిందని సిరిపాంగ్ చెబుతున్నారు.
దాదాపు 15ఏళ్లుగా లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి బౌద్ధ భిక్షువుగా మారాలనే ఆలోచనలో ఉన్నారు.
పూర్తిస్థాయిలో సన్యాసాన్ని స్వీకరించేందుకు మరో రెండేళ్ల సమయం ఉందని ఆయన తెలిపారు.
ఈలోపు ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే ధ్యానం,ఆధ్యాత్మిక సాధనలో గడపాలని సిరిపాంగ్ భావిస్తున్నారు. తన జీవితాన్ని బౌద్ధ బోధనలకు అంకితం చేయాలనే లక్ష్యంతో వ్యాపారం నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
తన కంపెనీని కొనుగోలు చేసేందుకు సరైన వ్యక్తిని గుర్తించి పరిచయం చేసిన వారికి సుమారు రూ.1.4 కోట్ల కమీషన్ అందిస్తానని సిరిపాంగ్ ప్రకటించారు.
ఇంత భారీ మొత్తాన్నికేవలం కొనుగోలుదారుడిని పరిచయం చేసినందుకు ఇస్తానని చెప్పడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వివరాలు
జ్ఞానోదయం పొందడమే తన జీవితానికి అసలు పరమార్థం
సిరిపాంగ్కు బౌద్ధమతంపై కూడా గాఢమైన ఆసక్తి ఉంది. ఇప్పటికే ఆ మతానికి సంబంధించిన పలు రచనలు చేశారు.
అంతేకాకుండా బుద్ధుడి బోధనలు, ఆధ్యాత్మిక అంశాలపై తరచూ ప్రసంగాలు చేస్తుంటారు.
జ్ఞానోదయం పొందడమే తన జీవితానికి అసలు పరమార్థమని ఆయన స్పష్టం చేశారు.
కోట్ల రూపాయల విలువైన విజయవంతమైన వ్యాపారాన్ని వదిలిపెట్టి సన్యాస జీవితాన్ని ఎంచుకోవాలనే సిరిపాంగ్ నిర్ణయం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భౌతిక సంపద, వ్యాపార విజయాల కంటే ఆధ్యాత్మిక ప్రశాంతతకే ప్రాధాన్యం ఇస్తున్న ఆయన నిర్ణయం ప్రత్యేకంగా నిలుస్తోంది.