Ethanol: లీటర్ ఎథనాల్కు 10 వేల లీటర్ల నీటి ఖర్చు.. నీటి సంక్షోభం మరింత పెరుగుతుందా..?
ఈ వార్తాకథనం ఏంటి
పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ విధానం నీటి సంక్షోభాన్ని మరింత తీవ్రమయ్యేలా చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎథనాల్ తయారీలో ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి అధిక నీరు అవసరమైన పంటలు ఉపయోగిస్తున్నారు. ఒక లీటర్ ఎథనాల్ తయారికి బియ్యం నుంచి దాదాపు 10,790 లీటర్ల నీరు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
90 లక్షల టన్నుల బియ్యమే లక్ష్యం
2024-25లో 52 లక్షల టన్నుల బియ్యాన్ని ఎథనాల్ కోసం కేటాయించిన ప్రభుత్వం, 2025-26 నాటికి దీనిని 90 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఇప్పటికే దేశంలో భూగర్భ జలాలు తీవ్రంగా తగ్గిపోతున్నాయి. 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో నీటి కొరత మరింత పెరిగే ప్రమాదం ఉందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎథనాల్ ఉత్పత్తి పెంపు నీటి సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.