Page Loader
Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

Rajnath Singh: భారత రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం.. లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి యూనిట్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 11, 2025
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో రక్షణ రంగంలో కీలక అడుగుగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్‌ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాన్ని 'ఉత్తరప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌'' పరిధిలో నిర్మించారు. కేంద్రాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌ వర్చువల్‌ మాధ్యమంలో ప్రారంభించనున్నారు. ఈ బ్రహ్మోస్‌ తయారీ యూనిట్‌ను ఏడాదికి 80 నుండి 100 క్షిపణులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగినలా డిజైన్‌ చేశారు. రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ కేంద్రం, భారత్‌-రష్యా సంయుక్త ఉపక్రమంగా బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీలో కీలక పాత్ర పోషించనుంది.

Details

400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం

బ్రహ్మోస్‌ క్షిపణి 290 నుండి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఇది 'ఫైర్ అండ్ ఫర్గెట్‌' గైడెన్స్‌ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. భూమి, సముద్రం, గగనతలాల నుంచి ప్రయోగించవచ్చేలా డిజైన్‌ చేశారు. కొత్తగా ప్రారంభమయ్యే ఈ కేంద్రంలో ఏడాదిలోగా 100 నుండి 150 కొత్త తరం బ్రహ్మోస్‌ క్షిపణుల తయారీ జరగనుంది. ఈ న్యూ జెనరేషన్‌ బ్రహ్మోస్‌ క్షిపణుల పరిధి 300 కిలోమీటర్లు కాగా, వాటి బరువు గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్‌ బరువు 2900 కిలోలు అయితే, కొత్త తరం క్షిపణుల బరువు కేవలం 1290 కిలోలకే పరిమితమైంది. ఈ అభివృద్ధి దేశ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలవనుంది.