No GPS Needed: జీపీఎస్ ఆఫ్లో ఉన్నా సరే.. ఫొటోలోని చిన్న వివరాలతో లొకేషన్ పసిగడుతున్న ఏఐ
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేయడం ఇప్పుడు అందరికీ సాధారణంగా మారిపోయింది. విహారయాత్రకు వెళ్లినా.. కొత్త ప్రదేశాన్ని సందర్శించినా అక్కడ దిగిన ఫొటోలను వెంటనే ఆన్లైన్లో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇకపై ఇలా చేసే ముందు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఫొటోలో జీపీఎస్ సమాచారం, లొకేషన్ ట్యాగ్, క్యాప్షన్ ఏదీ లేకపోయినా.. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఆ ఫొటో ఎక్కడ తీసిందో గుర్తించే అవకాశం ఉందని మెకాఫీ అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
21 వేలకుపైగా ఫొటోలపై పరిశీలన
మెకాఫీ 21,236 ట్రావెల్ ఫొటోలను పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించింది.
ఇందుకోసం గూగుల్కు చెందిన గెమ్మా 3 27B, అలీబాబాకు చెందిన క్వెన్ 3 వీఎల్ 30బీ ఏఐ మోడళ్ల పనితీరును పరీక్షించింది.
గెమ్మా మోడల్ 87 శాతం ఫొటోల్లో నగరం, దేశాన్ని సరిగ్గా గుర్తించింది. క్వెన్ 3 మాత్రం 91 శాతం కచ్చితత్వాన్ని సాధించింది.
వివరాలు
చిన్న వివరాల ఆధారంగా అంచనా
ఫొటోలో కనిపించే భవనాలు, రోడ్డు గుర్తులు, దుకాణాల బోర్డులు, ఆకాశహర్మ్యాలు, వెలుతురు, ఆహార దుకాణాలు వంటి చిన్నచిన్న వివరాలను ఏఐ నిశితంగా పరిశీలిస్తుంది. వాటి ఆధారంగా ఫొటో తీసిన ప్రాంతాన్ని అంచనా వేస్తుంది.
అంటే ఫొటోలో నేరుగా లొకేషన్ వివరాలు లేకపోయినా.. చుట్టుపక్కల కనిపించే దృశ్యాలే ఏఐకి కీలక సమాచారంగా మారుతున్నాయి.
వివరాలు
ప్రసిద్ధ ప్రాంతాల్లో మరింత కచ్చితత్వం
ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలను ఏఐ సులభంగా గుర్తించగలిగింది.
అయితే సాధారణ బీచ్లు, గ్రామీణ రహదారులు, హోటల్ గదుల వంటి ప్రదేశాల విషయంలో దాని కచ్చితత్వం కొంత తగ్గింది.
అయినప్పటికీ చాలా సందర్భాల్లో కనీసం ఆ ఫొటో ఏ దేశంలో తీసిందో గుర్తించగలిగింది.
అంతేకాదు.. సోషల్ మీడియాలో ఎప్పుడూ పోస్ట్ చేయని వ్యక్తిగత ఫొటోలను ఏఐ టూల్స్లో అప్లోడ్ చేసినా.. అవి ఎక్కడ తీసినవో గుర్తించిన ఉదాహరణలు ఉన్నాయని మెకాఫీ అధ్యయనం పేర్కొంది.
వివరాలు
సైబర్ నేరగాళ్లకు ఉపయోగపడే ప్రమాదం
ఈ తరహా టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని మెకాఫీ హెచ్చరించింది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా వేదికల్లో కనిపించే ప్రయాణ ఫొటోలను ఏఐతో విశ్లేషించి.. ఒక వ్యక్తి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే అవకాశం ఉంటుంది.
అలా సేకరించిన లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించి బ్యాంకు మోసాలు లేదా నకిలీ లాగిన్ హెచ్చరికల పేరుతో మరింత నమ్మదగిన మెసేజ్లను పంపే అవకాశం ఉందని మెకాఫీ తెలిపింది.
వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం ద్వారా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.
వివరాలు
దేశంలో భారీగా సైబర్ నేరాలు
ఇప్పటికే దేశంలో సైబర్ నేరాలు భారీగా నమోదవుతున్నాయి.
2025లో భారత్లో 28.15 లక్షల సైబర్ నేరాలు నమోదైనట్లు కేంద్ర హోంశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేరాల కారణంగా ప్రజలు ఏకంగా రూ.22,495 కోట్లను నష్టపోయారు.
ఈ నేపథ్యంలో ఫొటోల ద్వారా వ్యక్తుల లొకేషన్ను గుర్తించగల ఏఐ టెక్నాలజీపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.