AI Videos: యూట్యూబ్లో ఏఐ దూకుడు.. మానవ కంటెంట్ పరిస్థితి ఏంటి?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అత్యధిక వ్యూస్ సంపాదించిన యూట్యూబ్ ఛానల్ భారత్కు చెందినదిగా గుర్తించారు. అయితే అది మానవులు స్వయంగా రూపొందించిన కంటెంట్కు సంబంధించినది కాదు. పూర్తిగా ఏఐ ద్వారా తయారైన వీడియోలతో నడిచే "బందర్ అప్నా దోస్త్" అనే యూట్యూబ్ ఛానల్నే అత్యధిక వ్యూస్ సాధించిన ఛానల్గా వీడియో ఎడిటింగ్ ప్లాట్ఫామ్ కాప్వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ పరిశోధన ప్రకారం భారతీయ ప్రేక్షకులు ఏఐ ఆధారిత వీడియో కంటెంట్ను భారీగా వీక్షిస్తున్నారని స్పష్టమైంది. యూట్యూబ్లో ఏఐ వీడియోల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మానవ కంటెంట్ క్రియేటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
తక్కువ నాణ్యతతో ఉన్న బ్రెయిన్రాట్
చాలా తక్కువ శ్రమతో, అతి తక్కువ ఖర్చుతో తయారవుతున్న ఏఐ స్పామ్ వీడియోలు నాణ్యతను దెబ్బతీస్తూ, మానవులు సృష్టించే అసలైన కంటెంట్కు నష్టం కలిగిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాప్వింగ్ పరిశోధకులు యూట్యూబ్లోని టాప్ 500 షార్ట్స్ వీడియోలను లోతుగా విశ్లేషించారు. అందులో 21 శాతం అంటే 104 వీడియోలు పూర్తిగా ఏఐ సాయంతో రూపొందినవిగా తేలగా,33 శాతం అంటే 165 వీడియోలు "బ్రెయిన్రాట్" కేటగిరీలోకి వస్తాయని గుర్తించారు. సాధారణంగా ఈ "బ్రెయిన్రాట్" కంటెంట్ తక్కువ నాణ్యతతో ఉండటం, కేవలం ఆకర్షణ కోసమే రూపొందించడం గమనార్హం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఏఐ వీడియోలపైనే ఆధారపడి పనిచేస్తున్న వందలాది యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
వివరాలు
ఏఐ వీడియోల వేగవంతమైన విస్తరణపై కాప్వింగ్ ఆందోళన
ఈ ఛానళ్లు కలిపి బిలియన్ల వ్యూస్ను సాధించడమే కాకుండా, యూట్యూబ్ ఆల్గోరిథమ్ను ఎంత చాకచక్యంగా వినియోగించుకుంటున్నాయో కూడా ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. ఏఐ వీడియోల వేగవంతమైన విస్తరణపై కాప్వింగ్ కూడా తన ఆందోళనను వ్యక్తం చేసింది. ముఖ్యంగా యూట్యూబ్లో షార్ట్స్ ఫీడ్లు, ట్రెండింగ్ విభాగాల్లో "AI స్లాప్"గా పిలిచే కంటెంట్.. అంటే తక్కువ శ్రమతో ఏఐ ద్వారా తయారై, కేవలం వ్యూస్ కోసం మాత్రమే రూపొందించే వీడియోలు.. అతి వేగంగా పెరుగుతున్నాయని కాప్వింగ్ హెచ్చరించింది.