Hottest cities: భారత్ను మండిస్తున్న భానుడు.. ప్రపంచంలోని అత్యంత వేడి టాప్ 50 నగరాలు దేశంలోనే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. భానుడి ఉగ్రరూపంతో ఉదయం నుంచే ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. బయటకు అడుగుపెట్టాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఉదయం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ప్రపంచంలోనే అత్యధిక వేడి నమోదైన తొలి 50 నగరాలు అన్నీ భారత్లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వడగాలుల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. ఒడిశాలోని బాలన్గిర్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాలి నాణ్యత, వాతావరణ పరిస్థితులను పరిశీలించే ఏక్యూఐ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
ప్రయాగ్రాజ్లలో ఉదయానికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
మహారాష్ట్రలోని చంద్రాపుర్, ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లలో శుక్రవారం ఉదయానికే 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఛత్తీస్గఢ్, బిహార్, తెలంగాణ, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు కూడా అత్యధిక వేడి నమోదైన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ప్రదేశ్లోని అనేక నగరాలు తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వారణాసి,బాందా,బరేలీ,అయోధ్య నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య, మధ్య భారత ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పలు రాష్ట్రాలకు ఎరుపు, నారింజ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఒక్క ఉదయంలోనే ప్రపంచంలోని అత్యంత వేడి 50నగరాలు భారత్లో నమోదవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
వివరాలు
పెరుగుతున్న ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య
2026లో ఎండల ప్రభావం ఎంత తీవ్రమైందో ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఆసుపత్రుల్లో వడదెబ్బ, శరీరంలో నీరు తగ్గిపోవడం వంటి సమస్యలతో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బయట పనులు చేసే కార్మికులు, చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మధ్యాహ్న సమయంలో అవసరం లేకపోతే బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలను తగ్గించుకోవాలని, తగినంత నీరు,ద్రవ పదార్థాలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.