AI data centers : దేశంలో ఏఐ సామర్థ్యం పెంచే దిశగా ఏఎండీ, టీసీఎస్ కీలక ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన చిప్ దిగ్గజం ఏఎండీ, దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ కలిసి భారత్లో ఏఐ డేటా సెంటర్ల నిర్మాణానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్లోనే తదుపరి తరం "హీలియోస్" అనే ర్యాక్ స్థాయి కృత్రిమ మేధస్సు ఆర్కిటెక్చర్ను అభివృద్ధి చేసి అమలు చేయనున్నారు. పెద్ద సంస్థలు, ప్రభుత్వ నియంత్రణలో ఉండే సార్వభౌమ ఏఐ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకువస్తున్నారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్ ద్వారా అమలయ్యే హీలియోస్ ప్రాజెక్ట్లో 200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏఐ సిద్ధంగా ఉండే డేటా సెంటర్ రూపకల్పన ఉంటుంది.
వివరాలు
ఇండియాఏఐ మిషన్ కింద రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు
ఇది భారత్లోని హైపర్స్కేలర్లు, ఏఐ కంపెనీలు, పెద్ద సంస్థలకు హైపర్ఫార్మెన్స్ ట్రైనింగ్, ఇన్ఫరెన్స్ పనులకు ఉపయోగపడనుంది. ఈ భాగస్వామ్యంలో ఏఎండీ తన పూర్తి స్థాయి ఏఐ కంప్యూట్ ప్లాట్ఫామ్ను అందిస్తే,టీసీఎస్ డేటా సెంటర్ ఇంజినీరింగ్,ఇంటిగ్రేషన్,ఎంటర్ప్రైజ్ అమలు బాధ్యతలు తీసుకుంటుంది. దేశీయంగా ఏఐ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ ఉండగా, ఇప్పటికే ఇండియాఏఐ మిషన్ కింద రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఈ అడుగు కీలకంగా మారింది.
వివరాలు
200 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ కేంద్రిత ప్రణాళిక
ఇదిలా ఉండగా, భారత్లో డేటా సెంటర్ రంగం వేగంగా ఎదుగుతున్న దశలోకి ప్రవేశించడంతో, దశాబ్దం చివరికల్లా మొత్తం సామర్థ్యం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో 200 మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ కేంద్రిత ప్రణాళిక భారత్లో హైపర్స్కేల్ లక్ష్యాలను స్పష్టంగా చూపిస్తోంది.