Apple: ర్యామ్ ధరల ప్రభావం.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ డిస్ప్లే ధర తగ్గించాలని ఆపిల్ ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
మెమరీ చిప్ల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ తయారీ వ్యయాన్ని నియంత్రించేందుకు ఆపిల్ కీలక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం,ఈ మోడల్లో ఉపయోగించే OLED డిస్ప్లే ప్యానెల్ల ధరను తగ్గించాలని కంపెనీ తన సరఫరాదారులతో చర్చలు జరుపుతోంది. ఇందుకోసం ఒక్కో OLED ప్యానెల్కు సుమారు 70డాలర్లు చెల్లించే ప్రతిపాదనను ఆపిల్ చేసినట్లు సమాచారం. ఈ డిస్ప్లే ప్యానెల్లను ప్రధానంగా శామ్సంగ్ డిస్ప్లే,ఎల్జీ డిస్ప్లే సంస్థలు సరఫరా చేయనున్నాయి. వీటి సగటు సరఫరా ధర సుమారు 66.50డాలర్లుగా ఉండే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాది ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ కోసం వసూలు చేసిన ధరతో పోలిస్తే దాదాపు 20శాతం తక్కువగా ఉండనుంది.
వివరాలు
OLED ప్యానెల్ల ధరలు తగ్గడం కొత్త విషయం కాదు
అయితే OLED ప్యానెల్ల ధరలు తగ్గడం కొత్త విషయం కాదని నివేదిక పేర్కొంది.
ప్రతి కొత్త ఐఫోన్ తరం విడుదలతో ప్యానెల్ల ధరలు క్రమంగా తగ్గుతున్నాయి.
ఐఫోన్ 16ప్రో మ్యాక్స్లో ఉపయోగించిన OLED ప్యానెల్ ధర 100 డాలర్లకు పైగా ఉండగా,ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లో అది సుమారు 80డాలర్ల స్థాయికి చేరింది.
ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కోసం మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
డిస్ప్లే ధర తగ్గుతుందని చెప్పడం వల్ల నాణ్యతలో రాజీ పడుతున్నారని భావించాల్సిన అవసరం లేదని నివేదిక స్పష్టం చేసింది.
ఐఫోన్ 18 ప్రో సిరీస్లో శామ్సంగ్ డిస్ప్లే తాజా ఆర్గానిక్ మెటీరియల్ సెట్తో రూపొందించిన M16 OLED డిస్ప్లేను ఉపయోగించే అవకాశం ఉంది.
వివరాలు
డిస్ప్లే ధర తగ్గించాలని ఆపిల్ కోరడానికి ప్రధాన కారణం ఇదే..
ఇది అధిక బ్రైట్నెస్,ఎక్కువ కాలం పనిచేసే సామర్థ్యం, మెరుగైన రంగుల ప్రతిబింబం వంటి ప్రత్యేకతలను అందించనుందని సమాచారం.
డిస్ప్లే ధర తగ్గించాలని ఆపిల్ కోరడానికి ప్రధాన కారణం మెమరీ చిప్ల ధరలు భారీగా పెరగడమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఈ అదనపు వ్యయాన్ని సమతుల్యం చేసేందుకు డిస్ప్లేలు,కెమెరా మాడ్యూల్స్ వంటి కీలక విడిభాగాల ధరలను తగ్గించే దిశగా కంపెనీ సరఫరాదారులతో చర్చలు జరుపుతోందని నివేదిక వెల్లడించింది.
పరిశ్రమకు చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం,మెమరీ ధరలు పెరగడాన్ని కారణంగా చూపుతూ ప్యానెల్ సరఫరాదారుల నుంచి ఆపిల్ గణనీయమైన ధర తగ్గింపును కోరుతోంది.
వివరాలు
ఐఫోన్ 18 సిరీస్ కోసం శామ్సంగ్, ఎల్జీ ప్యానెల్ల పంపిణీ
అత్యాధునిక ఆర్గానిక్ మెటీరియల్తో తయారైన హైఎండ్ ప్యానెల్ల సరఫరా ధరలు కూడా తగ్గుతున్నాయని, దీంతో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ప్యానెల్ తయారీ సంస్థల లాభాలు సరఫరా పరిమాణం, ఉత్పత్తి సామర్థ్యం, ఖర్చు తగ్గింపుపై ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
మార్కెట్ పరిశోధనా సంస్థ UBI రీసెర్చ్ అంచనాల ప్రకారం, ఈ ఏడాది ఐఫోన్ 18 సిరీస్ కోసం శామ్సంగ్ డిస్ప్లే సుమారు 4.6 కోట్ల OLED ప్యానెల్లను సరఫరా చేయనుండగా, ఎల్జీ డిస్ప్లే సుమారు 4.109 కోట్ల ప్యానెల్లను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.
వీటిలో ఎక్కువ భాగం ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలోనే ఉపయోగించే అవకాశం ఉంది.
వివరాలు
ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు కూడా పెంపు బాట పట్టే అవకాశం
ఇదిలా ఉండగా, మెమరీ చిప్ల కొరత ప్రభావంతో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరలు 200 డాలర్ల వరకు పెరిగే అవకాశముందని మరో నివేదిక పేర్కొంది.
ఇటీవలే మెమరీ చిప్ల కొరత కారణంగా తయారీ వ్యయం పెరగడంతో ఐప్యాడ్లు, మ్యాక్బుక్ల ధరలను కూడా ఆపిల్ పెంచిన విషయం తెలిసిందే.
దీంతో ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు కూడా పెంపు బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.