Samsung price hike: మొబైల్ యూజర్లకు బిగ్ షాక్..! శాంసంగ్ మళ్లీ ధరల పెంపు
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్సంగ్ మరోసారి తన స్మార్ట్ఫోన్ ధరలను పెంచింది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎంట్రీ లెవల్, మిడ్ రేంజ్ ఫోన్ల ధరలను పెంచిన ఈ కంపెనీ, తాజాగా మరికొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై రేట్లను సవరించింది. ముఖ్యంగా గెలాక్సీ A, F సిరీస్ ఫోన్లు ఈ ధరల పెంపులో భాగమయ్యాయి. ఈ విషయాన్ని టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు. కొత్త ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
వివరాలు
ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే..?
టిప్స్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, గెలాక్సీ A06 స్మార్ట్ఫోన్ ధరను దాదాపు రూ.1000 పెంచడంతో, బేస్ వేరియంట్ ధర రూ.13,499కు చేరింది. గెలాక్సీ A07 మోడల్పై రూ.1250 పెంచి, దీని ప్రారంభ ధరను రూ.10,999గా నిర్ణయించారు. గెలాక్సీ A17 స్మార్ట్ఫోన్పై వేరియంట్ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు పెంపు జరిగింది. దీంతో టాప్ వేరియంట్ ధర రూ.27,999కు చేరింది. అలాగే గెలాక్సీ A36పై రూ.1500 నుంచి రూ.3000 వరకు, గెలాక్సీ A56పై రూ.2000 నుంచి రూ.3500 వరకు ధరలు పెంచారు.
వివరాలు
ఇతర మోడళ్లపై కూడా పెంపు
ఇటీవలే అంటే రెండు రోజుల క్రితం కూడా కొన్ని మోడళ్లపై ధరలు పెంచిన విషయం తెలిసిందే. గెలాక్సీ M36, గెలాక్సీ F36 ఫోన్లపై రూ.1000 చొప్పున పెంచారు. గెలాక్సీ M06, F06 మోడళ్లపై రూ.1500 నుంచి రూ.2000 వరకు పెంపు జరిగింది. గెలాక్సీ M07, F07 స్మార్ట్ఫోన్లపై రూ.1900 వరకు ధరలను సవరించారు. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 8 నుంచే అమల్లోకి వచ్చినట్లు సమాచారం.