Potatoes : బంగాళాదుంపలే ఆండీస్ ఆదివాసీల జన్యువులను మార్చాయా?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సాధారణ ఆహారంగా మారిపోయిన బంగాళాదుంపకు దాదాపు 10 వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆండీస్ పర్వత ప్రాంతాల్లో నివసించిన స్థానిక ఆదివాసీ ప్రజలే తొలిసారిగా దీనిని సాగులోకి తీసుకొచ్చినట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ఈ దుంప వారి ఆహారంలో అంతర్భాగంగా మారడంతో, దాన్ని శరీరం మరింత సమర్థంగా జీర్ణించుకునేలా వారి జన్యువుల్లోనూ కాలక్రమేణా మార్పులు చోటుచేసుకున్నట్లు తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం ఆండీస్ ప్రాంతానికి చెందిన ఆ ఆదివాసీ ప్రజల వారసుల్లో పిండి పదార్థాలను జీర్ణించుకోవడానికి సహాయపడే జన్యు ప్రతుల సంఖ్య ప్రపంచంలోని ఇతర జనాభా సమూహాలతో పోలిస్తే అత్యధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
వివరాలు
పిండి పదార్థాలను జీర్ణించుకునే జన్యు సామర్థ్యం..
'నేచర్ కమ్యూనికేషన్స్' అనే శాస్త్రీయ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో ప్రపంచంలోని 85 జనాభా సమూహాలకు చెందిన 3,723 మంది వ్యక్తుల జన్యు సమాచారాన్ని పరిశీలించారు.
ఇందులో AMY1 అనే జన్యువుపై పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
AMY1 జన్యువు నుంచి లాలాజలంలోని అమైలేజ్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది.
మనం తీసుకునే పిండి పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో ఈ ఎంజైమ్ కీలక పాత్ర పోషిస్తుంది.
అంటే, ఒక వ్యక్తిలో AMY1 జన్యువు ప్రతులు ఎక్కువగా ఉంటే.. సాధారణంగా లాలాజల అమైలేజ్ కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
దాంతో పిండి పదార్థాలను జీర్ణించుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది.
వివరాలు
సంతానోత్పత్తి విషయంలో ప్రయోజనం..
ఆండీస్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ ప్రజల్లో ఇతర జనాభా సమూహాలతో పోలిస్తే AMY1 జన్యువుకు రెండు నుంచి నాలుగు అదనపు ప్రతులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ ప్రత్యేక జన్యు లక్షణం బంగాళాదుంపలను సాగు చేయడం ప్రారంభమైన కాలంలోనే రూపుదిద్దుకున్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి.
బంగాళాదుంపలను ఆహారంలోకి తీసుకురావడం ప్రారంభమైన తర్వాత, AMY1 జన్యువు ఎక్కువ ప్రతులు కలిగిన వ్యక్తులకు ప్రతి తరంలో 1.24 శాతం మేర జీవించి ఉండటం లేదా సంతానోత్పత్తి విషయంలో ప్రయోజనం లభించినట్లు పరిశోధకులు అంచనా వేశారు.
ఎక్కువ AMY1 ప్రతులు కలిగిన వ్యక్తులు సహజ ఎంపిక ప్రక్రియలో ప్రయోజనం పొందడంతో, ఆ జన్యు లక్షణం తదుపరి తరాల్లో మరింత విస్తరించింది.
వివరాలు
అసలు కారణం బంగాళాదుంపలేనా?
"వివిధ మానవ సమూహాలు తమ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా జన్యుపరమైన మార్పులను పొందివుండొచ్చని జీవశాస్త్రవేత్తలు చాలాకాలంగా భావిస్తున్నారు.
అయితే, ఈ విషయాన్ని ఇంత బలంగా నిరూపించే ఆధారాలు చాలా అరుదు" అని అధ్యయనంలో సహ రచయితగా ఉన్న, యూనివర్సిటీ ఆఫ్ బఫెలోకు చెందిన పరిణామ జీవశాస్త్రవేత్త ఓమర్ గోక్చుమెన్ తెలిపారు.
ఆండీస్ ప్రాంతంలోని పెరూ ఆదివాసీ ప్రజల్లో సగటున AMY1 జన్యువు ప్రతులు మెక్సికోకు చెందిన మాయా ఆదివాసీ సమూహం కంటే ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
పెరూ ఆండీస్ ప్రాంత ప్రజలు, మాయా ప్రజలు ఇద్దరికీ పరిణామ పరంగా కొంత ఉమ్మడి చరిత్ర ఉంది.
అయితే వీరిద్దరి ఆహారపు సంప్రదాయాల్లో ఒక కీలకమైన తేడా ఉంది.
వివరాలు
వేల సంవత్సరాలుగా బంగాళాదుంపల సాగు..
ఆండీస్ ప్రజలు వేల సంవత్సరాలుగా బంగాళాదుంపలను సాగు చేసి ఆహారంగా ఉపయోగిస్తుండగా, మాయా ప్రజల్లో అలాంటి బంగాళాదుంప సాగు సంప్రదాయం లేదు.
అయితే AMY1 జన్యువు ప్రతుల మధ్య కనిపిస్తున్న ఈ తేడాకు నిజంగా బంగాళాదుంపల సాగే కారణమా? లేక యూరోపియన్ వలసవాదుల రాక తర్వాత ఆ ప్రాంతాల్లో ఏర్పడిన కరువు, వ్యాధులు, యుద్ధాలు, ఘర్షణల కారణంగా కొందరు మాత్రమే బతికి మిగలడం వల్ల ఈ జన్యు తేడా ఏర్పడిందా? అనే ప్రశ్న పరిశోధకుల ముందుంది.
మరో మాటలో చెప్పాలంటే, యూరోపియన్ వలస పాలన సమయంలో ఎవరు బతికి బయటపడ్డారు, ఎవరు మరణించారు అనే అంశం వల్లే ఈ జన్యు మార్పు కనిపిస్తోందా? అనే సందేహాన్ని కూడా వారు పరిశీలించాల్సి వచ్చింది.