Peston: కరోనా,ఆర్థిక సంక్షోభాన్ని ముందే చెప్పిన జర్నలిస్ట్.. ఇప్పుడు AIపై అలర్ట్.. ప్రపంచానికి కొత్త హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం,కోవిడ్ 19 మహమ్మారి వంటి కీలక పరిణామాలపై ముందుగానే హెచ్చరించిన బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ ఇప్పుడు మరో కీలక హెచ్చరిక చేశారు. ఈసారి ఆయన ఆందోళన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence-AI)గురించి. వేగంగా అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికత భవిష్యత్తులో కోట్లాది మంది ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. AI వల్ల ఏర్పడే ప్రమాదాలనే ప్రధాన అంశంగా తీసుకుని రాసిన తన కొత్త పుస్తకం"ది కిల్ స్విచ్"(The Kill Switch)లో ఈ అంశాలను వివరించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల నాయకులు ఇతర విషయాల కంటే AI వల్ల కలిగే ప్రమాదాలపైనే ఎక్కువగా చర్చించి, ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
ఉద్యోగాలు తగ్గితే ప్రభుత్వాల ముందున్న సవాలు
అయితే ఆ దిశగా పెద్దగా చర్చ జరగకపోవడం తనను తీవ్రంగా కలవరపెడుతోందని చెప్పారు.
ఇప్పటికే అనేక రంగాల్లో AI మానవ ఉద్యోగాలను భర్తీ చేయడం ప్రారంభించిందని పెస్టన్ పేర్కొన్నారు.
భవిష్యత్తులో సంస్థలు మరింత విస్తృతంగా AIను వినియోగించనున్నట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు పెరిగే అవకాశముందని చెప్పారు.
ఒకవేళ ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధిని కోల్పోతే, ఆదాయపు పన్నుపై ఆధారపడకుండా ప్రభుత్వ సేవలకు నిధులు సమకూర్చే కొత్త ఆర్థిక విధానాలపై ప్రభుత్వాలు ఇప్పటి నుంచే ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
వివరాలు
AI పెట్టుబడులతో మరో ఆర్థిక సంక్షోభం?
AI అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లు, విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి భారీ మొత్తంలో పెట్టుబడులు వెళ్తున్నాయని పెస్టన్ తెలిపారు.
ఈ పరిస్థితి మరో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి దారితీయొచ్చనే భయం తనకు ఉందన్నారు.
వచ్చే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వివరాలు
గత హెచ్చరికలను పట్టించుకోలేదన్న పెస్టన్
66 ఏళ్ల రాబర్ట్ పెస్టన్ గతంలో కూడా ప్రభుత్వాలకు పలుమార్లు హెచ్చరికలు చేశారు.
తక్కువ అవకాశమున్నా తీవ్ర ప్రభావం చూపే సంఘటనల సంకేతాలు అప్పుడే కనిపించినప్పటికీ, ప్రభుత్వాలు వాటిని సరిగా గుర్తించలేదని విమర్శించారు.
2008 ఆర్థిక సంక్షోభానికి ముందు బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న పరిస్థితులు తీవ్ర నష్టానికి దారితీస్తాయని తాను హెచ్చరించానని గుర్తు చేశారు.
అయితే అప్పట్లో తన వ్యాఖ్యలను చాలామంది రాజకీయ నాయకులు, ఆర్థిక రంగ ప్రముఖులు "భయపెట్టే ప్రచారం"గా కొట్టిపారేశారని చెప్పారు.
అనంతరం చైనాపై చేసిన అధ్యయనాలు, వుహాన్ పర్యటనల అనుభవంతో 2019 చివర్లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే అది చాలా ప్రమాదకరమని ప్రభుత్వ వర్గాలకు హెచ్చరించినట్లు పెస్టన్ వెల్లడించారు.