Hypersonic Missiles: హైపర్సోనిక్ టెక్నాలజీలో భారత్ సెన్సేషన్.. స్క్రామ్జెట్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్ యుద్ధాల స్వరూపాన్ని పూర్తిగా మార్చగల క్షిపణి సాంకేతికతలో భారతదేశం మరో కీలక విజయాన్ని సాధించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్ఢీఓ హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమంలో భాగంగా 'స్క్రామ్జెట్ కంబస్టర్' దీర్ఘకాల పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల డీఆర్డీఎల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఇందులో స్క్రామ్జెట్ ఇంజిన్ నిరంతరాయంగా 1,200 సెకన్లు (సుమారు 20 నిమిషాలు) విజయవంతంగా పనిచేసింది. గత జనవరిలో జరిగిన పరీక్షలో ఇదే ఇంజిన్ను 700 సెకన్లపాటు మాత్రమే నడిపించగా, ఈసారి దానికంటే మెరుగైన పనితీరు నమోదైంది.
వివరాలు
వేగంలో సరికొత్త శకం
ఈ సాంకేతికత ద్వారా క్షిపణులు ధ్వని వేగానికి ఐదు రెట్లు (Mach 5+) లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు. ఇలాంటి అత్యధిక వేగాల వద్ద ప్రస్తుత వాయు రక్షణ వ్యవస్థలకు వాటిని అడ్డుకోవడం అత్యంత కష్టసాధ్యంగా పరిగణించబడుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విజయంతో స్వదేశీ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధికి భారత్ మరింత దగ్గరైంది. అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు ఇప్పటికే ఈ హైపర్సోనిక్ సామర్థ్యాలను కలిగి ఉండగా, భారత్ కూడా అదే స్థాయిలో వేగంగా ముందుకు సాగుతోందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్
హైపర్సోనిక్ క్షిపణులు అధిక వేగంతో పాటు ప్రయాణ మార్గాన్ని మధ్యలోనే మార్చుకోగల సామర్థ్యం కలిగి ఉండటంతో, శత్రు రాడార్ వ్యవస్థలు వాటిని గుర్తించడం, అడ్డుకోవడం చాలా కష్టమవుతుంది. ఈ విజయం కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా, ప్రపంచ రక్షణ రంగంలో భారతదేశ స్థాయిని మరింత బలపరిచే ఘట్టంగా భావిస్తున్నారు. ఇది భవిష్యత్తులో రక్షణ సహకారం, అలాగే రక్షణ ఉత్పత్తుల ఎగుమతులకు కూడా కొత్త అవకాశాలను తెరవవచ్చని అంచనా. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓతో పాటు విద్యా సంస్థలను అభినందించారు.
వివరాలు
ప్రత్యేకంగా ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు
సాంకేతికంగా చూస్తే, స్క్రామ్జెట్ ఇంజిన్ గాలిలోని ఆక్సిజన్ను ఉపయోగించి పనిచేస్తుంది. దీంతో ప్రత్యేకంగా ఆక్సిజన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా క్షిపణులు తేలికగా ఉండి, ఎక్కువ వేగం, ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని పొందుతాయి. అయితే అత్యధిక వేగాల వద్ద ఏర్పడే తీవ్రమైన వేడి (thermal stress) ప్రధాన సవాలుగా నిలుస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు డీఆర్డీఓ అభివృద్ధి చేసిన "యాక్టివ్ కూలింగ్" సాంకేతికతను పరీక్షలో విజయవంతంగా ఉపయోగించారు. ఈ వ్యవస్థ అధిక ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో కూడా ఇంజిన్ను రక్షిస్తూ, దీర్ఘకాలం స్థిరంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ తాజా విజయం భారత హైపర్సోనిక్ క్షిపణి అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.