ISRO: 'సబోటాజ్కు ఆధారాలు లేవు'.. ఇస్రో వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత ఏడాదిలో ఎదుర్కొన్న వ్యూహాత్మక మిషన్ వైఫల్యాలపై "సబోటాజ్ జరిగినట్టు ఇప్పటివరకు ఎలాంటి నివేదికలు లేవు" అని కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి డా. జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 12 నెలల్లో భారత్ చేపట్టిన ఆరు మిషన్లలో మూడు విఫలమయ్యాయని, అవన్నీ దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ప్రయోజనాల కోసమేనని చెప్పారు. NVS-02 ఉపగ్రహం, PSLV-C61/EOS-09, PSLV-C62/EOS-N1 మిషన్లు విఫలమైనవిగా పేర్కొన్నారు. 33 ఏళ్ల పీఎస్ఎల్వీ ప్రయాణంలో ఇప్పటివరకు కేవలం నాలుగు పెద్ద వైఫల్యాలే ఉండగా, 2025 మే, 2026 జనవరిలో వరుసగా మిడ్-ఫ్లైట్లో జరిగిన వైఫల్యాలు ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఇస్రోలో వైఫల్య విశ్లేషణ
ఈ సందర్భంగా సబోటాజ్ అంశంపై ప్రశ్నించగా,"అంతరిక్ష శాఖ మంత్రిగా ప్రయోగాలకు నేను బాధ్యుడిని. సబోటాజ్ ఉందో లేదో పరిశీలించేది ఇతర శాఖల పని. ఈ ప్రశ్న రక్షణ, హోంశాఖ లేదా విదేశాంగ శాఖలకు వెళ్లాలి" అంటూ డా. సింగ్ సమాధానమిచ్చారు. అయినప్పటికీ, ప్రస్తుతం అలాంటి నివేదికలు ఏవీ లేవని మరోసారి స్పష్టం చేశారు. పీఎస్ఎల్వీ వరుస వైఫల్యాలపై మాట్లాడిన మంత్రి, "గతసారి జరిగిన తప్పిదమే ఇప్పుడు కూడా జరిగింది అనే అభిప్రాయం ఉంది. కానీ అలా కాదు. రెండు సార్లు మూడో దశలో సమస్య వచ్చినా, కారణాలు వేర్వేరు" అని తెలిపారు. ఇస్రోలో వైఫల్య విశ్లేషణ చాలా సూక్ష్మంగా, విశ్లేషణాత్మకంగా జరుగుతుందని, దానిపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
వివరాలు
మిషన్పై రూపొందించిన నివేదిక
సాధారణంగా ఇస్రో తమ మిషన్ వైఫల్యాలపై నివేదికల సారాంశాన్ని ప్రజలతో పంచుకుంటుంది. అయితే 2025 మేలో విఫలమైన PSLV-C61/EOS-09 మిషన్పై రూపొందించిన నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపినప్పటికీ, ప్రజలకు మాత్రం వెల్లడించలేదు. అలాగే 2026 జనవరిలో జరిగిన PSLV-C62/EOS-N1 వైఫల్యంపై కూడా మంత్రి వ్యాఖ్యలు తప్ప మరిన్ని వివరాలు బయటకు రాలేదు.
వివరాలు
తొమ్మిదేళ్లలో విఫలమైన ఐదు భారత వ్యూహాత్మక అంతరిక్ష మిషన్ల వివరాలు
గత తొమ్మిదేళ్లలో విఫలమైన ఐదు భారత వ్యూహాత్మక అంతరిక్ష మిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2026 జనవరిలో జరిగిన PSLV-C62/EOS-N1 ప్రయోగం, మే 2025లో ఎదురైన ఎదురుదెబ్బ తర్వాత పీఎస్ఎల్వీ మళ్లీ ప్రయోగానికి వచ్చిన తొలి మిషన్. అదే సమయంలో 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం కూడా ఇదే. ఇందులో డీఆర్డీవో తయారు చేసిన 'ఈఓఎస్-ఎన్1 (అన్వేష)' అనే భూమి పరిశీలన ఉపగ్రహం ఉంది. ఇది హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఉండి, భూమిపైని పదార్థాలను చాలా సూక్ష్మంగా గుర్తించేలా రూపొందించారు. అయితే,మూడో దశలో తలెత్తిన లోపం కారణంగా ఉపగ్రహం, రాకెట్ రెండూ కోల్పోయారు.
వివరాలు
PSLV-C61/EOS-09 ప్రయోగించిన ఆరు నిమిషాలకే సమస్య
అంతకుముందు 2025 మే 18న జరిగిన PSLV-C61/EOS-09 ప్రయోగంలో కూడా ఆరు నిమిషాలకే సమస్య తలెత్తింది. రెండో దశ వరకు అన్నీ సక్రమంగానే ఉన్నాయని,మూడో దశలో పనితీరులో లోపం కనిపించడంతో మిషన్ పూర్తికాలేదని అప్పటి ఇస్రో చీఫ్ డా. వి. నారాయణన్ తెలిపారు. అన్ని వాతావరణాల్లో,పగలు-రాత్రి తేడా లేకుండా చిత్రాలు అందించే రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం ఇది. కానీ మధ్యలోనే విఫలమైంది. 2025 జనవరిలో GSLV-F15 ద్వారా ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం కూడా తుది కక్ష్యలోకి వెళ్లలేకపోయింది. ప్రాథమిక కక్ష్య వరకు రాకెట్ సరిగానే పనిచేసినా, ఉపగ్రహంలోని ఇంజిన్లు ఆన్ కాకపోవడంతో నావిక్ వ్యవస్థలో కీలకమైన ఈ ఉపగ్రహం ఉపయోగం లేకుండా పోయింది. నావిక్ భారత్కు జీపీఎస్కు సమానమైన స్వదేశీ వ్యవస్థగా భావిస్తున్నారు.
వివరాలు
ఐదు మిషన్ల వైఫల్యాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి వందల మిలియన్ డాలర్ల నష్టం
ఇదే తరహాలో 2021 ఆగస్టులో GSLV-F10/EOS-03 (జిసాట్-1) మిషన్, 2017 ఆగస్టులో PSLV-C39/IRNSS-1H మిషన్లు కూడా సాంకేతిక లోపాల వల్ల విఫలమయ్యాయి. హీట్ షీల్డ్ విడిపోకపోవడం, క్రయోజెనిక్ దశలో వాల్వ్ లీక్ వంటి చిన్న తప్పిదాలే పెద్ద నష్టానికి దారి తీసినట్లు ఇస్రో అప్పట్లో వివరించింది. ఈ ఐదు మిషన్ల వైఫల్యాల వల్ల కేంద్ర ప్రభుత్వానికి వందల మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. మళ్లీ అదే మిషన్లను చేపట్టాలంటే అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తుంది.
వివరాలు
ప్రతి వైఫల్యానికి కారణమైన భాగం వేర్వేరు
అంతేకాదు, ఈ ఉపగ్రహాలు లేకపోవడంతో భారత్కు అవసరమైన కొన్ని వ్యూహాత్మక సేవలను విదేశీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇస్రో విడుదల చేసిన పరిమిత సమాచారం ప్రకారం, ప్రతి వైఫల్యానికి కారణమైన భాగం వేర్వేరుగా ఉంది. ఇది అంతరిక్ష రంగం ఎంత సున్నితమైనదో, చిన్న తప్పిదం కూడా ఎంతటి నష్టానికి దారి తీస్తుందో మరోసారి గుర్తు చేస్తోందని నిపుణులు అంటున్నారు.