6G: గుడ్ న్యూస్..6జీ కోసం కేంద్రం రోడ్మ్యాప్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో 6జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను రూపొందించింది. ఈ అత్యాధునిక టెలికాం సాంకేతికత దిశగా ఇండియా వేగంగా ముందుకు సాగుతోంది. టెలికాం రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మొత్తం 104 ప్రాజెక్టులకు మద్దతు అందిస్తోంది. ఈ ప్రాజెక్టుల కోసం టెలికాం టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా సుమారు రూ.271 కోట్లను కేటాయించినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నిధులు రిసెర్చ్ సంస్థలు, స్టార్టప్లు, పలు సంస్థలకు అందించి, టెక్నాలజీల అభివృద్ధిని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్ టెలికాం సాంకేతికతలో భారత్ కేవలం ఇతర దేశాలను అనుసరించడమే కాకుండా, ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకోవాలని ప్రభుత్వం చూస్తోంది.
వివరాలు
భారత్ 6జీ విజన్
6జీ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే విధంగా ప్రభుత్వం "భారత్ 6జీ విజన్" అనే పత్రాన్ని కూడా విడుదల చేసింది. ఇందులో 6జీ సేవల అభివృద్ధి, పరిశోధన (ఆర్ అండ్ డి)పై దృష్టి, ఇన్నోవేషన్ కేంద్రాల ఏర్పాటు, భవిష్యత్లో ఈ నెట్వర్క్లను ఎలా అమలు చేయాలనే అంశాలపై సమగ్ర ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం విదేశీ టెలికాం సంస్థలపై ఆధారపడకుండా స్వదేశీ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అని కేంద్రం తెలిపింది.
వివరాలు
మూడు దశలుగా ప్రణాళిక
6జీ అమలుకు అవసరమైన స్పెక్ట్రమ్ పరీక్షలు, సాంకేతిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక రోడ్మ్యాప్ను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికను మూడు ప్రధాన దశలుగా విభజించారు: షార్ట్ టర్మ్: 2025 - 2026 మిడ్ టర్మ్: 2027 - 2030 లాంగ్ టర్మ్: 2031 - 2035 ఈ దశల ప్రణాళిక ద్వారా పరిశోధకులు ఆధునిక 6జీ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు పొందుతారు. ఈ ప్రణాళిక రూపొందించడంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) నిర్వహించిన అధ్యయనాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.
వివరాలు
6జీ టెక్నాలజీ ప్రయోజనాలు
పరిశోధనల ప్రకారం 6జీ నెట్వర్క్లు ప్రస్తుత 5జీ నెట్వర్క్లతో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. దీని వల్ల అల్ట్రా ఫాస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్, రియల్ టైమ్ హోలోగ్రామ్ టెక్నాలజీ, స్మార్ట్ సిటీ వ్యవస్థలు, పలు నెట్వర్క్లు మరింత ముందుకు సాగుతాయి. భారీ పెట్టుబడులు, విస్తృత స్థాయి పరిశోధన ప్రాజెక్టులతో కలిసి భారత్ డిజిటల్ కనెక్టివిటీలో తదుపరి దశను చేరుకునేందుకు బలమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది.