ISRO: చంద్రయాన్-4 కోసం ఇస్రో కీలక నిర్ణయం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ స్థలం ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
చందమామపైకి చేపట్టనున్నచంద్రయాన్ 4 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలను మరింత వేగవంతం చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఈ వ్యోమనౌకను దించాల్సిన ప్రదేశాన్ని తాజాగా ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జాబిల్లి మీద నుంచి నమూనాలను సేకరించి భూమికి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రయాన్-4ను రూపొందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
వివరాలు
2028 నాటికి ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని సంస్థ లక్ష్యం
చందమామపై ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన మిషన్లలో ఇదే అత్యంత క్లిష్టమైనదిగా భావిస్తున్నారు. 2028 నాటికి ఈ ప్రయోగాన్ని నిర్వహించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. చంద్రుడిపై ఉన్న మాన్స్ మౌటన్ (ఎంఎం) ప్రాంతంలో ఎంఎం-1, ఎంఎం-3, ఎంఎం-4, ఎంఎం-5 అనే నాలుగు ప్రాంతాలను ల్యాండింగ్కు అనువుగా ఇస్రో పరిశీలించగా, అందులో ఎంఎం-4 ప్రాంతాన్ని తుది ఎంపిక చేసినట్లు తెలిపారు. చందమామ కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్లోని హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) అందించిన స్పష్టమైన చిత్రాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు.