LOADING...
ISRO: మార్చి నాటికి ISRO ప్లాన్ చేసిన 7 ప్రయోగాల్లో 6 వాయిదా
మార్చి నాటికి ISRO ప్లాన్ చేసిన 7 ప్రయోగాల్లో 6 వాయిదా

ISRO: మార్చి నాటికి ISRO ప్లాన్ చేసిన 7 ప్రయోగాల్లో 6 వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్చి 2026 నాటికి పూర్తి చేయాల్సిన ఏడు ప్రధాన మిషన్లలో ఆరు మిషన్లు గడువులో పూర్తి కాలేకపోయాయి. గత డిసెంబర్‌లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, స్పేస్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఏడు మిషన్లు ప్లాన్ చేసిందని తెలిపారు. ఇప్పటివరకు న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ నిర్వహించిన LVM3 M6 మిషన్ మాత్రమే డిసెంబర్ 24, 2025న విజయవంతంగా పూర్తైంది. మిగతా ఆరు మిషన్లు 2026 తొలి మూడు నెలల్లో జరగాల్సి ఉన్నప్పటికీ వాయిదా పడ్డాయి. అందులో PSLV C62/EOS-N1 లక్ష్య కక్ష్యను చేరుకోలేకపోవడం,అలాగే గగనయాన్ తొలి మానవ రహిత ప్రయోగం HLVM3-G1/OM1 జరగకపోవడం ముఖ్యంగా ఉన్నాయి.

వివరాలు 

పనిచేయడం ఆగిపోయిన IRNSS-1F ఉపగ్రహంలోని క్లాక్

ఇదే కాకుండా GSLV-F17/EOS-05, PSLV C63/TDS-01, PSLV-N1/EOS-10, SSLV-L1/NSIL మిషన్లు కూడా ఆలస్యమయ్యాయి. ఇంకా భారత ప్రాంతీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో(IRNSS) ఉన్న ఉపగ్రహాల్లో కేవలం మూడు ఉపగ్రహాల అటామిక్ క్లాక్‌లు మాత్రమే సరిగా పనిచేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది దేశీయ GPS వ్యవస్థ NavICకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. IRNSS-1F ఉపగ్రహంలోని క్లాక్ మార్చి 13న పనిచేయడం ఆగిపోయింది. అయినప్పటికీ, దీన్ని తుఫాన్ హెచ్చరికల వంటి వన్‌వే మెసేజింగ్ సేవల కోసం ఉపయోగించేందుకు ISRO ప్రయత్నిస్తోంది.

వివరాలు 

పార్లమెంటరీ కమిటీ ఆందోళన

మరోవైపు మార్చిలో ISRO CE20 క్రయోజెనిక్ ఇంజిన్‌ను సముద్ర మట్టం వద్ద విజయవంతంగా పరీక్షించింది. ఈ ఇంజిన్ LVM3 రాకెట్ మూడో దశకు కీలకం కాగా, గగనయాన్ మిషన్‌కు అర్హత పొందింది. అంతర్జాతీయంగా, యూరోపియన్ అంతరిక్ష సంస్థతో కలిసి భూమి పరిశీలన మిషన్ల కోసం సంయుక్త పరిశోధనలు, క్యాలిబ్రేషన్ కార్యకలాపాలపై ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, స్పేస్ రంగంలో టెక్నాలజీ బదిలీలు తక్కువ ధరలకు జరుగుతున్నాయనే అంశంపై పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. తక్కువ ధరల వల్ల ప్రైవేట్ సంస్థలు భారీ లాభాలు పొందుతుండగా, అసలు పరిశోధనా సంస్థలకు తక్కువ ప్రయోజనం కలుగుతోందని పేర్కొంది. దీనిపై స్పేస్ డిపార్ట్‌మెంట్ మార్కెట్ ఆధారిత ధరల విధానం తీసుకురావాలని కమిటీ సూచించింది.

Advertisement