LOADING...
India-Made AI Chip: జోహో మద్దతుతో కేరళ స్టార్టప్‌ సంచలనం.. ఇండియాలో తయారైన AI చిప్‌ విడుదల
ఇండియాలో తయారైన AI చిప్‌ విడుదల

India-Made AI Chip: జోహో మద్దతుతో కేరళ స్టార్టప్‌ సంచలనం.. ఇండియాలో తయారైన AI చిప్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

కేరళకు చెందిన టెక్ స్టార్టప్‌ 'నెట్రాసెమీ' (Netrasemi) తన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) చిప్‌ 'A2000'ను విడుదల చేసింది. భారత టెక్నాలజీ రంగానికి ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లోనే డిజైన్ చేసిన తొలి AI/ML చిప్‌లలో ఇది ఒకటిగా నిలిచింది. జోహో (Zoho) మద్దతుతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ ఇప్పటికే తన ప్రధాన A2000 AI సిస్టమ్-ఆన్-చిప్‌ (SoC)ను విజయవంతంగా పరీక్షించి, ఉత్పత్తికి సిద్ధమైందని ప్రకటించింది.

వివరాలు 

చిన్న డివైస్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిప్

A2000 చిప్‌ను తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే చిన్న ఎడ్జ్‌ డివైస్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇది TSMC యొక్క 12nm ప్రాసెస్‌పై తయారైంది. స్మార్ట్ కెమెరాలు, ఎడ్జ్ AI బాక్స్‌లు, ఇంటెలిజెంట్ వీడియో గేట్‌వేల్లో ఈ చిప్‌ను ఉపయోగించనున్నారు. ఇందులో న్యూరల్ ప్రాసెసింగ్‌, కంప్యూటర్ విజన్‌, ఇమేజ్ హ్యాండ్లింగ్‌, సెక్యూరిటీకి సంబంధించిన ప్రత్యేక ప్రాసెసింగ్ యూనిట్‌లను నెట్రాసెమీ స్వయంగా అభివృద్ధి చేసింది.

వివరాలు 

2027 నుంచి భారీ స్థాయిలో ఉత్పత్తి

ప్రస్తుతం నెట్రాసెమీ సంస్థ A2000 చిప్‌ను సర్వైలెన్స్‌, ఆటోమొబైల్ రంగాలకు చెందిన ముగ్గురు కస్టమర్లతో ప్రారంభ దశ పరీక్షలు నిర్వహిస్తోంది. 2027 నుంచి తైవాన్‌లోని TSMC ప్లాంట్‌లో భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే ఏడాది మధ్యలో వాణిజ్య పరంగా మార్కెట్లోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం పలు OEM కంపెనీలతో కలిసి శాంపిల్‌ టెస్టింగ్‌, కో-డెవలప్‌మెంట్ పనులు కొనసాగుతున్నాయని నెట్రాసెమీ సీఈఓ జ్యోతిస్‌ ఇందిరాభాయ్ తెలిపారు.

Advertisement

వివరాలు 

₹125 కోట్ల పెట్టుబడులు సమీకరించిన నెట్రాసెమీ

నెట్రాసెమీ ఇప్పటివరకు మొత్తం ₹125 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. జోహోతో పాటు యూనికార్న్ ఇండియా వెంచర్స్‌ వంటి సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. 2023లో కేంద్ర ప్రభుత్వ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్‌ (DLI) పథకం కింద ₹15 కోట్ల మద్దతు పొందిన నాలుగు స్టార్టప్‌లలో నెట్రాసెమీ కూడా ఒకటి. ఈ ఆర్థిక సహకారంతోనే సంస్థ అత్యాధునిక AI చిప్‌ల అభివృద్ధిని వేగవంతం చేసింది.

Advertisement

వివరాలు 

మరో రెండు అధునాతన AI చిప్‌ల అభివృద్ధి

నెట్రాసెమీ ప్రస్తుతం 'R1000 AI/ML MCU' పేరుతో మరో చిప్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఇది IoT సెన్సార్ మార్కెట్‌ను లక్ష్యంగా రూపొందించారు. ఈ ప్రాజెక్ట్‌ను కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ తిరువనంతపురంతో కలిసి MeitY Chip-to-Startup (C2S) ప్రోగ్రామ్‌ కింద రూపొందించారు. అలాగే 'A4000' పేరుతో అధునాతన ఎడ్జ్ AI సర్వర్ చిప్‌పైనా కంపెనీ పని చేస్తోంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ శాఖ మద్దతుతో రూపొందుతున్న ఈ చిప్‌ 2027 రెండో త్రైమాసికానికి తయారీకి సిద్ధమవుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Advertisement