Laptop Catches Fire: ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా ల్యాప్టాప్లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది. విమానం గమ్యస్థానానికి చేరుకుని ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ల్యాప్టాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అట్లాంటా నుంచి డాలస్కు.. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం 2398 DFW అట్లాంటా నుంచి డాలస్కు బయలుదేరింది. సిబ్బందితో కలిపి విమానంలో మొత్తం 133 మంది ఉన్నారు. డాలస్లోని ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండింగ్కు సిద్ధమవుతుండగా.. వెనుక భాగంలోని క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు కనిపించాయి.
వివరాలు
ల్యాప్టాప్ను పక్కకు జరిపే క్రమంలో..
ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ల్యాప్టాప్కు మంటలు అంటుకోవడంతో తోటి ప్రయాణికులు దానిని పక్కకు జరిపేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. పరిస్థితిని గమనించిన ఫ్లైట్ అటెండెంట్లు వెంటనే స్పందించారు.
మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టి వాటిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ల్యాప్టాప్ను విమానం మధ్యభాగానికి తరలించారు.
సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం
మంటలు అదుపులోకి రావడంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయ అత్యవసర సిబ్బంది, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన ప్రయాణికులకు ప్రాథమిక చికిత్స అందించారు.
వివరాలు
సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది
ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని అమెరికన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది.
ల్యాండింగ్ సమయంలో ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న ల్యాప్టాప్లో మంటలు చెలరేగాయని తెలిపింది.
విమాన సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రతను తగ్గించగలిగారని పేర్కొంది.