LOADING...
NASA: వోయేజర్-1లో కీలక పరికరం ఆఫ్.. మిషన్ కొనసాగింపుకు నాసా కీలక నిర్ణయం
వోయేజర్-1లో కీలక పరికరం ఆఫ్.. మిషన్ కొనసాగింపుకు నాసా కీలక నిర్ణయం

NASA: వోయేజర్-1లో కీలక పరికరం ఆఫ్.. మిషన్ కొనసాగింపుకు నాసా కీలక నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 21, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మకమైన మిషన్‌గా నిలిచిన వోయేజర్ 1 విషయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది. 47 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఈ యానం సేవలను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించేందుకు శాస్త్రవేత్తలు మరో సైన్స్ పరికరాన్ని నిలిపివేశారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు భాగంగా ఏప్రిల్ 17న Jet Propulsion Laboratory బృందం'లో ఎనర్జీ ఛార్జ్డ్ పార్టికల్స్' (LECP) పరికరాన్ని ఆఫ్ చేసింది. న్యూక్లియర్ శక్తితో పనిచేస్తున్న ఈ యానం ప్రస్తుతం తక్కువ పవర్‌తో కొనసాగుతోంది. దీన్ని మరింత కాలం పని చేయించేందుకు డేటా సేకరణను త్యాగం చేయాల్సి వచ్చిందని నాసా తెలిపింది. ఈ నిర్ణయం వల్ల వోయేజర్-1కు సుమారు మరో ఏడాది వరకు అదనపు సమయం లభిస్తుందని పేర్కొంది.

వివరాలు 

వోయేజర్-1లో ఇంకా పనిచేస్తున్న రెండు పరికరాలు

జేపీఎల్ మిషన్ మేనేజర్ కరీమ్ బదరుద్దీన్ మాట్లాడుతూ, "సైన్స్ పరికరాన్ని ఆపడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే సరైన మార్గం" అని చెప్పారు. ప్రస్తుతం వోయేజర్-1లో ఇంకా రెండు పరికరాలు పనిచేస్తున్నాయి. ఒకటి ప్లాస్మా తరంగాలను గమనిస్తుండగా, మరొకటి మాగ్నెటిక్ ఫీల్డ్స్‌ను కొలుస్తోంది. ఇవి ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తూ, మనిషి ఎప్పుడూ పరిశీలించని అంతరిక్ష ప్రాంతాల నుంచి డేటాను పంపిస్తున్నాయి. 1977లో ప్రయోగించినప్పటి నుంచి LECP పరికరం దాదాపు అంతరాయం లేకుండా పనిచేసింది. ఇది ఐయాన్లు, ఎలక్ట్రాన్లు, కాస్మిక్ రేడియేషన్ వంటి తక్కువ శక్తి కణాలను కొలవడంలో కీలక పాత్ర పోషించింది.

వివరాలు 

కాస్మిక్ రే సబ్‌సిస్టమ్‌ను ఆఫ్ చేసిన శాస్త్రవేత్తలు

ఇక 2026 ఫిబ్రవరి 25న మరో పరికరం అయిన కాస్మిక్ రే సబ్‌సిస్టమ్‌ను కూడా శాస్త్రవేత్తలు ఆఫ్ చేశారు. ఈ పరికరం మూడు టెలిస్కోపుల సమాహారంగా ఉండి, సూర్యుడు, గ్యాలక్సీ, అంతకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే అధిక శక్తి కణాలను గుర్తించేది. ముఖ్యంగా 2012లో వోయేజర్-1 హీలియోస్ఫియర్‌ను దాటి బయటకు వెళ్లిన సందర్భాన్ని నిర్ధారించడంలో ఇది కీలకంగా నిలిచింది. వోయేజర్-1, వోయేజర్-2 యానాలు ప్లూటోనియం క్షయం ద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తిని విద్యుత్‌గా మార్చుకుని పనిచేస్తున్నాయి.

Advertisement

వివరాలు 

13 బిలియన్ మైళ్ల దూరంలో వోయేజర్-2

ప్రతి సంవత్సరం సుమారు 4 వాట్ల పవర్ తగ్గుతోంది. తిరిగి చార్జ్ చేసే అవకాశం లేకపోవడంతో, కీలక వ్యవస్థలను నిలుపుకునేందుకు ఒక్కొక్క పరికరాన్ని ఆఫ్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం వోయేజర్-1 భూమి నుంచి 15 బిలియన్ మైళ్లకు పైగా దూరంలో ఉంది. దీని నుంచి వచ్చే రేడియో సంకేతం భూమికి చేరడానికి 23 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక వోయేజర్-2 సుమారు 13 బిలియన్ మైళ్ల దూరంలో ఉంది.

Advertisement